‘కేటగిరీ’ మార్పులతో చార్జీలు పెరగవు | Sakshi
Sakshi News home page

‘కేటగిరీ’ మార్పులతో చార్జీలు పెరగవు

Published Tue, Apr 25 2017 2:28 AM

‘కేటగిరీ’ మార్పులతో చార్జీలు పెరగవు

డిస్కంలకు అదనపు ఆదాయం రాదు: టీఎస్‌ఎస్పీడీసీఎల్‌
సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ కనెక్షన్ల కేటగిరీ నిర్వచనంలో ప్రతిపాదించిన మార్పులతో విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఎలాంటి అదనపు ఆదాయం రాదని, చార్జీలు కూడా పెరగవని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుత్‌ చార్జీల పెంపు లేకుండానే రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి టారీఫ్‌ ప్రతిపాదనలను ప్రతి పాదించామని పేర్కొంది. విద్యుత్‌ కనెక్షన్ల కేటగిరీల్లో డిస్కంలు ప్రతిపాదించిన మార్పులపై సోమవారం ‘సాక్షి’లో ‘లేదు లేదంటూనే బాదుడు’శీర్షికతో ప్రచురితమైన కథనంపై సంస్థ యాజమాన్యం స్పందించి ఈ మేరకు వివరణ ఇచ్చింది.

కనెక్షన్ల కేటగిరీల్లో మరింత స్పష్టత ఇచ్చేందుకు, న్యాయపరమైన చిక్కులను అధిగమించేందు కే కేటగిరీ నిర్వచనంలో మార్పులు ప్రతిపాదించినట్లు తెలిపింది. ఎల్టీ–2 కమర్షియల్‌ విద్యుత్‌ కనెక్షన్లు, హెచ్‌టీ–2(ఇతర) కేటగిరీల నిర్వచనం పరిధిలోకి కొత్తగా అన్ని రకాల సర్వీసింగ్‌ స్టేషన్లు, రిపేరింగ్‌ సెంటర్లు, బస్‌ డిపోలు, లాండ్రీలు, డ్రై క్లీనింగ్‌ యూని ట్లు, గ్యాస్‌/ఆయిల్‌ స్టోరేజీ/ట్రాన్స్‌ఫర్‌ స్టేష న్లు, గోదాములు/స్టోరేజీ యూనిట్లను చేర్చాలని ప్రతిపాదించామని, వాస్తవానికి ఈ రకా ల కనెక్షన్లకు ఇప్పటికే కమర్షియల్, హెచ్‌టీ–2 (ఇతర) కేటగిరీల కిందే చార్జీలు విధిస్తున్నామ ని వెల్లడించింది.

ఐటీ పరిశ్రమల పరిధిలోని ఐటీయేతర వ్యాపారాలనూ ఇప్పటివరకు ఐటీ యూనిట్ల కిందే పరిగణించి అనుమతులిచ్చేవారని పేర్కొంది. ఇప్పుడు ఐటీయేతర కార్యకలాపాలను మినహాయించాకే ఐటీ పరిశ్రమలకు అనుమతులిస్తున్నారని తెలి పింది. ఇప్పటివరకు ఎల్టీ, హెచ్‌టీ పరిశ్రమల కేటగిరీల పరిధిలో ఉన్న ఐటీ సంస్థల సముదాయంలోని కేఫ్టేరియా, హోటళ్లు, ఏటీఎంలు, బ్యాంకులు, ఆడిటోరియంలు, ఇతర సదుపాయాలను ఎల్టీ–2 కమర్షియల్, హెచ్‌టీ–3(ఇతర) కేటగిరీల నిర్వచనం పరిధిలోకి చేర్చాలని ప్రతిపాదించామని తెలిపింది.

Advertisement
Advertisement