ప్రముఖ రచయిత నోముల సత్యనారాయణ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భాషా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో తనదైన ముద్రవేసిన బహు భాషా కోవిదుడు, రచయిత డాక్టర్ నోముల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సత్యనారాయణ కుటుంబసభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
బహుభాషావేత్త, ప్రముఖ రచయిత అయిన నోముల సత్యనారాయణకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నల్లగొండలోని రవీంద్రనగర్కు చెందిన ఆయన ఇంగ్లిష్ లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. కథ, నవల, కవిత్వం, విమర్శ లాంటి సాహిత్య ప్రక్రియల్లో ఆయనకు విశేషమైన పరిచయం ఉంది. ‘అన్ టోల్డ్ లెసన్’ అనే పుస్తకాన్ని రచించిన సత్యనారాయణకు నల్లగొండలో నడిచే గ్రంథాలయంగా పేరుంది. ఆయన కుటుంబ సభ్యులు నోముల సాహితీ సమితిని స్థాపించి.. ఏటా ఉత్తమ కథలకు పురస్కారాలు అందజేస్తున్నారు.