కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అపహరణకు గురైనట్లు భావిస్తున్న ఓ యువతి కిడ్నాప్ కథ సుఖాంతమైంది.
భాగ్యనగర్ కాలనీ(హైదరాబాద్): కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అపహరణకు గురైనట్లు భావిస్తున్న ఓ యువతి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు యువతిని అపహరించుకుపోయినట్లు ఫిర్యాదును అందుకున్న కూకట్పల్లి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టగా యువతిని అపహరించింది ఆమె ప్రియుడేనని తేల్చారు. ఇద్దరూ కలసి గుంటూరులో ప్రేమ వివాహం చేసుకున్నట్లు నిర్ధారించిన పోలీసులు వారిని పోలీస్స్టేషన్కు తీసుకువచ్చారు. వివేకానందనగర్ కాలనీలోని తన బంధువుల ఇంటికి వేసవి సెలవుల్లో వచ్చిన మంజుషా పిన్ని పద్మావతితో కలిసి సోమవారం మార్కెట్కు వెళ్లి వస్తోంది. వారు ఇంటి ముందుకు రాగానే అదే సమయంలో మంజుషాపై దాడి చేసి కారులో ఎక్కించుకొని పరారయ్యారు.
కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా సదరు యువతి శ్రీరాం అనే యువకుడితో 2010 నుంచి ప్రేమాయణం సాగిస్తున్నట్లు శ్రీరాం బంధువులు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మంజుషాను శ్రీరాం తన స్నేహితులతో కలిసి పథకం ప్రకారం.. కారులో అపహరించుకు వెళ్లి గుంటూరులో ప్రేమ వివాహం చేసుకున్నాడు. బంధువుల ద్వారా యువతిని వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని సీఐ పురుషోత్తం తెలిపారు.