సాక్షి, హైదరాబాద్: రైతుబంధు చెక్కులు పొందిన రైతులందరూ తమ పరిధి లోని వ్యవసాయ విస్తరణాధికారులను కలసి రైతుబంధు బీమా వివరాలను అందించాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో రైతుబంధు బీమా పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆగస్టు 15 నుంచి రైతులకు జీవిత బీమా బాండ్లను అందిస్తామని తెలిపారు.
రైతులు త్వరితగతంగా ఏఈవోలను కలసి నామినిపేరు, ఇతర వివరాలను ఇవ్వాలన్నారు. గ్రామ, మండల రైతు సమన్వయ సమితి సభ్యులు వ్యవసాయ శాఖ అధికారులకు సహకరించి రైతుల నుంచి వివరాలను సేకరించడంలో తోడ్పాటు అందించాలని సూచించారు. సమావేశానికి వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి, కమిషనర్ యం.జగన్మోహన్, అడిషనల్ డైరెక్టర్ విజయ్కుమార్ హాజరయ్యారు.