పెళ్లి ఏడాది తరువాత చేస్తామని చెప్పడంతో..

Person Died Because Of Parents Delaying  Marriage - Sakshi

సాక్షి, సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): వివాహం చేయడం లేదని మనస్తాపంతో ఓ యువకుడు వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ నరేశ్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మోడెగాం గ్రామానికి చెందిన కడతల సంతోష్‌రెడ్డి(27) అనే యువకుడు విదేశాలకు వెళ్లి సెలవుపై మూడు నెలల క్రితం ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తనకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులను అడిగాడు.

ఏడాది తర్వాత చేస్తామని తల్లిదండ్రులు చెప్పడంతో మనస్తాపంతో రెండు రోజుల క్రితం కామారెడ్డిలోని బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని బైకుపై ఇంటి నుంచి బయలు దేరాడు. ఇంటికి వస్తున్నాను అని శనివారం ఉదయం 8గంటలకు ఫోన్‌ చేసి చెప్పాడు. మళ్లీ 10 గంటలకు ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ అని వచ్చింది. ఆదివారం ఉదయం 6గంటలకు గ్రామ శివారులోని బురుజురాళ్ల దగ్గర ఉన్న వ్యవసాయ బావి వద్ద పశువుల రేకుల కొట్టంలోని సిమెంట్‌ ఫోల్‌కు నైలాన్‌ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు కుటుంబీకులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబీకులు గుండెలు బాదుకున్నారు. మృతుడి తల్లిదండ్రులు వెంకట్‌రెడ్డి, సుజాత బోరున విలపించడంతో కంటతడి పెట్టించాయి. మృతుడికి సోదరుడు కృష్ణారెడ్డి ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top