వైఎస్సార్ సీపీకి ఈసీ గుర్తింపుపై హర్షం | peoples have joyful on ysrcp got recognition of central | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీకి ఈసీ గుర్తింపుపై హర్షం

May 28 2014 12:21 AM | Updated on May 25 2018 9:17 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు రావడంతో మండలంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

 ఘట్‌కేసర్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు రావడంతో మండలంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాజన్న జిందాబాద్, జైజై జగన్ అంటూ నినాదాలు చేస్తూ మిఠాయిలు తినిపించుకుంటూ మంగళవారం సాయంత్రం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గృహకల్ప కాలనీ వైఎస్సార్ సీపీ కన్వీనర్ కొండయ్య మాట్లాడుతూ పార్టీకి గుర్తింపు లభించడంతో మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా కొనసాగాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ అందించి సంక్షేమానికి తోడ్పడిన ఘనత వైఎస్‌దేనన్నారు. ఆయన హఠాన్మరణంతో పదవి చేపట్టిన వారు ఆ పథకాలన్నీ  నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

 రాజన్న పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తమ కష్టాలు తొలగిపోతాయని అనుకుంటున్నారని చెప్పారు. వైఎస్సార్ సీపీకి ప్రజాదరణ ఓర్వలేని కొన్ని రాజకీయ పార్టీలు జగన్‌మోహన్ రెడ్డిని ఎదగనీయకుండా కుట్రలు పన్నుతున్నాయని, ప్రజలు వాటిని గమనిస్తున్నారని... వాటికి తప్పక గుణపాఠం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సుందర్‌కుమార్, రమేషగుప్త, ఈశ్వరమ్మ, కొండల్, మురళి, కేఎస్ రావు, రంగయ్య, బీనాఠాగూర్, బయ్యన్న, దుర్గాప్రసాద్, రాజు, మహేష్, కిరణ్‌రెడ్డి, అశోక్, శ్రీనివాస్, అద్దాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement