
ఏఐసీటీఈ నిబంధనల్లో జోక్యం చేసుకోం
అన్ని విషయాలు తెలుసుకునే వృత్తి విద్యా కళాశాలలు ఏర్పాటు చేయాలని, తర్వాత ఆర్థికంగా గిట్టుబాటు కావడం లేదంటూ ఏఐసీటీఈ నిబంధనలను సవాల్ చేయడం సరికాదని హైకోర్టు పేర్కొంది.
ఆ నిబంధనలను అన్ని కళాశాలలు పాటించాల్సిందే: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: అన్ని విషయాలు తెలుసుకునే వృత్తి విద్యా కళాశాలలు ఏర్పాటు చేయాలని, తర్వాత ఆర్థికంగా గిట్టుబాటు కావడం లేదంటూ ఏఐసీటీఈ నిబంధనలను సవాల్ చేయడం సరికాదని హైకోర్టు పేర్కొంది. విద్యను వ్యాపారంగా మార్చినప్పుడు ఇతర శక్తులూ ఇందులో ప్రవేశించే అవకాశం ఉందని వ్యాఖ్యా నించింది.
ఈ నేపథ్యంలో వృత్తి విద్యా కళాశాలల నిర్వహణకు సంబంధించి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) రూపొందించిన నిబం ధనల్లో జోక్యం చేసుకోమని పేర్కొంది. ఏఐసీటీఈ నిబంధనలను ప్రతి కళాశాల పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఏఐసీటీఈ చట్టం 1987 సెక్షన్ 10(1)(ఐ) కింద రూపొందించిన నిబంధనలను సవాల్ చేస్తూ జోసెఫ్ శ్రీహర్ష అండ్ మేరీ, ఇంద్రజ ఎడ్యుకేషనల్ సొసైటీతోపాటు మరో మూడు మైనారిటీ విద్యా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన జస్టిస్ రామసుబ్రమణియన్, జస్టిస్ జె. ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
స్థానిక పరిస్థి తులకు అనుగుణంగా కాకుండా దేశమంతటా ఒకే విధమైన నిబంధనలు రూపొందించడం చట్ట విరుద్ధమని, ఏఐసీటీఈ నిబంధనలను 100 శాతం అమలు చేయడం ఏ విద్యా సంస్థకు సాధ్యం కాదని పిటిషనర్ల తరఫు న్యాయవాది నివేదించారు. కళాశాల వ్యయం, ట్యూషన్ ఫీజులు, బోధనా సిబ్బం ది నిష్పత్తి తదితర అంశాలపై ఒకే తరహా నిబంధనలు రూపొం దించడం చెల్లదని పేర్కొన్నారు.
దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. చట్టపరమైన అధికారంతోనే ఏఐసీటీఈ నిబంధనలు రూపొందించిందని, ఈ సంస్థ స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉందని పేర్కొంది. ఫీజు ఆధారంగా విద్యా ప్రమాణాలు, నిబంధనలు ఉండాలనడం సరికాదని, ఆర్థికంగా గిట్టుబాటు కావడం లేదన్న కారణంగా నిబంధలను సవాల్ చేయకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.