రేపు ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవన వర్షాలు బుధవారం నుంచి మొదలయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. దీని కారణంగా రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావం రాష్ట్రంలో ఉండదని, రానున్న మూడ్రోజులు పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది.