ప్రతిభలో గుడ్డు మాయం..! | No Nutrition in government housing | Sakshi
Sakshi News home page

ప్రతిభలో గుడ్డు మాయం..!

Dec 17 2014 8:31 AM | Updated on Sep 2 2017 6:20 PM

ప్రతిభలో గుడ్డు మాయం..!

ప్రతిభలో గుడ్డు మాయం..!

ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

కుళ్లిన అరటిపండ్లే పోషకాహారం
చాలీచాలని కూరలతో భోజనం

 భద్రాచలం : ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. చివరకు సరైన పౌష్టికాహారం కూడా అందటం లేదు. విలీన మండలాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. భద్రాచలం సమీపంలోని ప్రతిభ పాఠశాలను మంగళవారం ‘సాక్షి’ పరిశీలించగా, ఇది తేటతెల్లమైంది. 6 నుంచి ఇంటర్ వరకూ ఉన్న ఇక్కడ 420 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలకు అనుబంధంగానే వసతి గృహం కూడా ఉంది. మధ్యాహ్న భోజనంలో గుడ్డు పెట్టలేదు.
 
పప్పు, వంకాయ కూర వండినప్పటకీ అవి సరిపోలేదు. పలువురు విద్యార్థులు భోజనం చేయకుండానే కూరలు అయిపోయాయి. చివరకు ఉపాధ్యాయల కోసం దాచిన వంకాయ కూరను అప్పటికప్పుడు తీసుకొచ్చి  వడ్డించా రు. చాలా మందికి పప్పు కూడా సరిపోలేదు. పప్పు కావాలని అడిగిన వారిపై వడ్డించే సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఇక పిల్లలు మంచినీరు తాగడానికి గ్లాసులు కూడా లేకపోవటంతో భోజనం చేసిన ప్లేట్లే శుభ్రం చేసుకుని వాటితోనే నీటి కోసం పరుగులు తీయడం కనిపించింది. పెరుగులో కలుపుకునే ఉప్పును అక్కడున్న ఓ కుర్చీలో పోయగా,  దుమ్ము దూళి పడుతున్నప్పటకీ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.
 
 కుళ్లిన అరటిపండ్లు పంపిణీ...
  గుడ్లు అయిపోయినందునే ఇవ్వలేకపోయామని పాఠశాల డిప్యూటీ వార్డెన్ సలీంఖాన్ తెలిపారు. కాగా, విద్యార్థులకు కుళ్లిన అరిటపండ్లనే పెట్టారు. పిల్లలు భోజనం చేసే డార్మిటరీ హాల్లో ఒక ట్రేలో అరిటిపండ్లును కుప్పగా వేశారు. అయితే అవన్నీ కుళ్లి నీళ్లు కారుతున్నాయి. అయినా వాటినే విద్యార్థులు తినాల్సి వచ్చింది. ఇవి తింటే రోగాలు వస్తాయని తెలిసీ కూడా పాఠశాల నిర్వాహకులు ఇలా వ్యవహరించటం విమర్శలకు తావిస్తోంది.
 
 అడిగేవారు లేరని...
  ఆంధ్రలో విలీనమైన ప్రాంతంలో ఈ పాఠశాల ఉండటంతో భద్రాచలం ఐటీడీఏ అధికారులు పర్యవేక్షించడం లేదు. ఆంధ్ర అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో విలీన మండలాల్లో ఉన్న ప్రభుత్వ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే పౌష్టికాహారంలో కోత పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెనూ ప్రకారం పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement