హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి తన డ్రైవర్, పనిమనిషితో కలిసి భోజనం చేస్తున్న ఫోటోను పోస్ట్ చేస్తూ, భారతదేశంలో వర్గ భేదాలు నెమ్మదిగా తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.తద్వారా తన దినచర్యలోని ఒక సాధారణమైన,కానీ హృద్యమైన సంగతులను పంచుకున్నారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
హైదరాబాద్కు చెందిన నరేష్ షేర్ చేసిన ఎక్స్లో ఒక సెల్ఫీని పోస్ట్ చేశారు. ముగ్గురూ కలిసి డైనింగ్ టేబుల్ వద్ద కీమా పరాఠా తింటూ కెమెరా వైపు చూసి నవ్వుతున్న నవ్వుతూ పోజులిచ్చారు. ఒక ఉల్లాసభరితమైన సెల్ఫీ తో షేర్ చేస్తూ దేశంలోని వర్గ భేదాలు మెల్లగా తొలగిపోవాలని ఆయన ఆకాంక్షించారు.
తమ ఇంట్లో పనిచేసే సిబ్బందితో( డ్రైవర్, మేడ్) కలిసి ప్రతి రెండు నెలలకొకసారి తాను ఇలా 'టీమ్ లంచ్' చేస్తానని నరేష్ క్యాప్షన్లో రాశారు. అంతేకాదు మొదట్లో వారు తనతో కలిసి డైనింగ్ టేబుల్పై కూర్చోవడానికి ఎంతలా సంకోచించారో కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా సమాజంలో ఉన్న అలవాట్లు, కండిషనింగ్ వల్ల వారు అలా కూర్చోవడానికి ఇబ్బంది పడ్డారని చెప్పారు.
"భారతదేశంలో ఉన్న ఈ వర్గ వ్యవస్థ పోవాలి. దేవుడి కోసమైనా గుర్తుంచుకోండి, ఇది 2026!" అని ఆయన రాసుకొచ్చారు.ఈ పోస్ట్ వెనుక ఒక మంచి సందేశం ఉన్నప్పటికీ, తాము తిన్నది మాత్రం చాలా సాధారణమైన 'కీమా పరాటా' మాత్రమేనని నరేష్ సరదాగా పేర్కొన్నారు.
నెటిజన్ల ప్రశంసలు
ఈ పోస్ట్పై ఇంటర్నెట్లో ప్రశంసల జల్లు కురుస్తోంది. చాలా మంది నెటిజన్లు తమ సొంత అనుభవాలను, సమాజంలోని వర్గ భేదాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇళ్లలో పనిచేసేవారు లేదా ఆఫీస్ సపోర్ట్ స్టాఫ్ పాత అలవాట్ల వల్ల విడిగా తినడానికే మొగ్గు చూపుతుంటారని, కానీ తాము కూడా వారిని ఒకే టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, ఒకే రకమైన పాత్రల్లో భోజనం పెట్టడం ద్వారా ఆ అదృశ్య గోడలను బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నామని కొందరు కామెంట్ చేశారు. నేటితరం శ్రమను గౌరవిస్తున్నారని పాతకాలపు వర్గ వ్యవస్థలను అంగీకరించడం లేదని, ఇలాంటి మార్పులు కొత్త తరం ఇళ్లలో ఎక్కువగా కనిపిస్తున్నాయని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ పోస్ట్ ఎంతో స్ఫూర్తినిచ్చిందని, భవిష్యత్తులో తాము కూడా ఇలాంటి చిన్న చిన్న మార్పుల ద్వారా సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తామని పలువురు నెటిజన్లు రాసుకొచ్చారు.


