పశు వైద్యశాలలకు ప్రభుత్వ పక్కా భవనాలు నిర్మిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: పశు వైద్యశాలలకు ప్రభుత్వ పక్కా భవనాలు నిర్మిస్తామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పశు సంపద ఆరోగ్య రక్షణకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
పశు సంపద ఆరోగ్య రక్షణకు పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,117 పశు వైద్యశాలలు పని చేస్తున్నాయని చెప్పారు. త్వరలోనే సంచార పశు వైద్యశాలలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఏప్రిల్ చివరి నాటికి వచ్చే ఈ వాహనాలు పశువులకు అత్యవసర సేవలను అందిస్తాయని పేర్కొన్నారు. నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున కేటాయిస్తామని చెప్పారు. జీవాల మీద ఆధారపడిన రైతులను తప్పకుండా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే పశు సంవర్ధక శాఖలో 161 పోస్టులను పబ్లిక్ కమిషన్ ద్వారా భర్తీ చేశామని తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు.