కొన్ని కుటుంబాలకే పరిహారం | nallu indrasena reddy takes on kcr | Sakshi
Sakshi News home page

కొన్ని కుటుంబాలకే పరిహారం

Nov 17 2014 3:18 AM | Updated on Mar 29 2019 9:24 PM

కొన్ని కుటుంబాలకే పరిహారం - Sakshi

కొన్ని కుటుంబాలకే పరిహారం

తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్నవారికి అసెంబ్లీ సాక్షిగా సంతాపం ప్రకటించిన కేసీఆర్..

అమరవీరుల ఆత్మక్షోభ కేసీఆర్‌ను వదలదు
రాష్ట్ర వినాశనానికి రావణాసురుడై
బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి


వినాయక్‌నగర్ : (నిజామాబాద్) : తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్నవారికి అసెంబ్లీ సాక్షిగా సంతాపం ప్రకటించిన కేసీఆర్ కొందరికి మాత్రమే పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. అమర వీరుల ఆత్మక్షోభ కేసీఆర్‌ను వదలదన్నారు. నిజామాబాద్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మా ట్లాడారు. 1200 మంది తెలంగాణ అమరవీరులను గుర్తించామని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ 450 మందికి మాత్రమే అమరులయ్యారని మాట్లాడడం విచారకరమన్నారు.

ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కేసీఆర్, జేఏసీ చైర్మన్ కోదండరాం అమరుల అంత్యక్రియలలో పాల్గొనడంతోపాటు  మృతుల కుటుంబాలను పరామర్శించారని గుర్తుచేశారు. ఉద్యమానికి క్షేత్ర స్థాయి నుంచి ఊపు అందించిన కోదండరాం మృతుల కుటుంబాలకు న్యాయం చేసే దిశగా పూర్తి బాధ్యతలను తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కరెంటు, నీరు, అధిక ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు పూర్తి న్యాయం చేయలేక కేసీఆర్ అనవసరపు విషయాలపై అందరి దృష్టిని మళ్లిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.

ఇష్టానుసారంగా మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీని ఆగౌరవపరుస్తున్నారన్నారు. గోదావరిలో నాలుగు కర్రలు పెడితే ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంట్ వస్తుందని ప్రగల్భాలు పలికిన కేసీఆర్, అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా కరెంటు తేవడంలో విఫలమయ్యారన్నారు. పరిపాలన చేతగాక కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారన్నారు. చాలా విషయాలలో కోర్టు తీర్పు రాష్ర్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినా ఆయనకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. రాష్ట్రంతో పాటు రాష్ట్ర ప్రజలను ఏమి చేయాలని అనుకుంటున్నారని ఆయన ఇంద్రసేనా రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర వినాశనానికే రావణసుడిలా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. సమావేశంలో రాష్ర్ట నాయకులు లోక భూపతిరెడ్డి, రోషన్‌లాల్ బోరా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement