ఓ కూతురిని హత్యచేసి... మరో కూతురితో కోర్టుకా? | Nalgonda Police to produce daughter murder suspect in court | Sakshi
Sakshi News home page

ఓ కూతురిని హత్యచేసి... మరో కూతురితో కోర్టుకా?

Jul 31 2014 12:20 PM | Updated on Aug 20 2018 4:27 PM

ఓ కూతురిని హత్యచేసి... మరో కూతురితో కోర్టుకా? - Sakshi

ఓ కూతురిని హత్యచేసి... మరో కూతురితో కోర్టుకా?

సృష్టిలో మాతృమూర్తికి మహోన్నత స్థానం ఉంది. కానీ ఆ అమ్మతనానికే మాయని మచ్చ తెచ్చింది ఓ కర్కశ హృదయురాలు.

నాగార్జున సాగర్ : సృష్టిలో మాతృమూర్తికి మహోన్నత స్థానం ఉంది. కానీ ఆ అమ్మతనానికే మాయని మచ్చ తెచ్చింది ఓ కర్కశ హృదయురాలు. కూతురిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితురాలిని  పోలీసులు బుధవారం కోర్టుకు తీసుకు వచ్చారు. ఆమె తనతో పాటు కోర్టుకు మరో కూతుర్ని వెంట తీసుకొచ్చింది. ఆమెను రిమాండ్ చేస్తే... ఆ చిన్నారి రక్షణ బాధ్యత ఎవరిది...? పోలీసులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్నారు... అవి కోర్టుకు వివరిస్తేనే నిందితురాలిని రిమాండ్ చేసేందుకు ఒప్పుకుంటా...అని న్యాయమూర్తి వి.సత్యనారాయణ అన్నారు. పోలీసులు చిన్నారి రక్షణకు తీసుకున్న చర్యలు వివరించినప్పుడే నిందితురాలి రిమాండ్కు ఒప్పుకుంటానని స్పష్టం చేస్తూ తిప్పి పంపారు.

వివరాల్లోకి వెళితే  నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం పంచాయితీ పరిధి బంటుగూడెంలో ఇటీవల చిన్నారి కృష్ణవేణిని తల్లే కడతేర్చిన విషయం తెలిసిందే.  అయితే ఆమె కొద్దిమాసాల క్రితమే తన చిన్న కుమార్తెను కూడా వదిలించుకోవాలని చూసింది. పెద్దవూర మండలం మూలతండాకు చెందిన వర్తియా హనుమంతు తన భార్య చనిపోవటంతో మేనకోడలు చంద్రకళను వివాహం చేసుకున్నాడు. కొద్దికాలానికే చంద్రకళ గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కాగా తనకు అడ్డువస్తున్న కూతుళ్లను వదిలించు్కోవాలని నిర్ణయించుకుంది.

దీనిలో భాగంగానే గత ఫిబ్రవరిలో తన చిన్న కుమార్తెను ఒంగోలు జిల్లాకు చెందిన వ్యక్తులకు విక్రయించింది. ఆ గ్రామ అంగన్వాడీ టీచర్ విషయం తెలుసుకొని సూపర్ వైజర్ ఖతీజాకు సమాచారం ఇచ్చింది. ఆమె ఆ తండాకు వెళ్లి విచారణ జరిపింది. శిశువిక్రయం నేరమని కేసు నమోదు చేస్తామని  బెదిరించటంతో విక్రయించిన అమ్మాయిని తెచ్చి తాను పెంచలేనని దేవరకొండలోని శిశుమందిర్కు అప్పగించింది. వారు చంద్రకళ, హనుమంతును పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఆ అమ్మాయిని తీసుకువెళ్లారు.

 

Advertisement
 
Advertisement
Advertisement