ఐటీ కారిడార్‌లో ‘మెట్రో’ 

'Metro' in IT corridor - Sakshi

     వచ్చే జూన్‌ 1 నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయండి

     హెచ్‌ఎంఆర్‌ అధికారులతో సమీక్షలో మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే జూన్‌ 1ని డెడ్‌లైన్‌ గా పెట్టుకుని ఐటీ కారిడార్‌ పరిధిలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. ప్రయాణికుల అవసరాలు తీర్చనున్న అమీర్‌పేట– హైటెక్‌ సిటీ మార్గంలో పనులు సత్వరంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. మెట్రో రైలు ప్రాజెక్టు (హెచ్‌ఎంఆర్‌) పనులపై మంగళవారం హెచ్‌ఎంఆర్‌ అధికారులతో బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. నగర ప్రజలు మెట్రో రైలును ఆహ్వానించిన తీరు, మెట్రో రైలు వినియోగంలో ప్రదర్శిస్తున్న క్రమశిక్షణ పట్ల మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మెట్రో రైలుకు భారీ స్పందన వస్తున్న నేపథ్యం లో రైళ్ల సంఖ్యను పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు.

ప్రయాణికుల రద్దీని బట్టి వచ్చే ఫిబ్రవరిలోగా రైళ్ల సంఖ్యను పెంచుతామని హెచ్‌ఎంఆర్‌ అధికారులు మంత్రికి తెలిపారు. మెట్రో ప్రయాణికులకు అవసరమైన పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నామని, ఇప్పటి వరకు ఉన్న పార్కింగ్‌ ప్రాంతాలు ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెట్రో రైలు స్మార్ట్‌ కార్డుల వినియోగం, ప్రయోజనాలు ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమా లు ఏర్పాటు చేయాలన్నారు. మెట్రో ఫీడర్ల రూట్లలో మరిన్ని బస్సుల ఏర్పాటుకు ఆర్టీసీతో మాట్లాడినట్లు తెలిపారు. మెట్రో రైలు ప్రయాణంపై ప్రయాణికుల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయాలపై ఈ సమావేశంలో చర్చించారు. మెట్రో స్టేషన్లలో తాగునీరు, మూత్ర శాలల ఏర్పాటుకు తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు.   

చింతకింది మల్లేశంకు రూ. కోటి సాయం
అందజేసిన మంత్రి కేటీఆర్‌  
సాపద్మశ్రీ పురస్కార గ్రహీత చింతకింది మల్లేశానికి రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కె.తారకరామారావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తాను రూపొందించిన లక్ష్మి ఆసు మెషీన్ల ఉత్పత్తిని పెంచేందుకు ఈ నిధులను మల్లేశం వినియోగించుకోనున్నారు. తెలంగాణలోని చేనేత కార్మికులకు ఉపయోగపడే ఈ మెషీన్ల తయారీకి అవసరమైన ఇంజనీరింగ్, ఇతర సౌకర్యాల కల్పనకు ఆర్థిక సహాయం చేయాలని మల్లేశం గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ మంగళవారం  మల్లేశానికి ఆర్థిక సహాయానికి సంబంధించిన జీవోను అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ గ్రామీణ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేయూతనిస్తుందని, అందులో భాగంగా గ్రామీణ స్థాయి నుంచి అద్భుత ఆవిష్కరణ చేసిన మల్లేశానికి ఈ సహాయం అందిస్తున్నామన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top