
సాక్షి, హైదరాబాద్: దేశంలోని యువతరాన్ని డ్రగ్స్కు దూరంగా ఉంచేందుకు సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నట్లు సుప్రీం కోర్టుకు కేంద్రం నివేదించింది. ఇప్పటికే ఓ ఉన్నతస్థాయి కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. డ్రగ్స్ నిరోధానికి, యువతరం డ్రగ్స్ బారినపడకుండా తీసుకుంటున్న చర్యలపై 2018 జనవరి చివరికి నివేదిక సమర్పించాలని ఉన్నతస్థాయి కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.ఎం.ఖన్వీల్కర్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి ఆస్తులను జప్తు చేసేలా కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రూ.10 కోట్ల కన్నా ఎక్కువ విలువ చేసే డ్రగ్స్ పట్టుపడ్డప్పుడు విదేశీయులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల ప్రమేయముంటే, దర్యాప్తు సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. దీంతో కేంద్ర మానవ వనరుల శాఖ కౌంటర్ను కోర్టుకు సమర్పించింది. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజా విచారణ సందర్భంగా కేంద్రం తరఫు అదనపు సాలిసిటర్ జనరల్ మనీందర్సింగ్ వాదిస్తూ.. యువతరాన్ని డ్రగ్స్కు దూరంగా ఉంచేందుకు నిర్దిష్ట విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.