
పరిశీలించారు..అనుమతి ఇస్తారా?
జిల్లా మెడికల్ కళాశాలను శనివారం ఎంసీఐ బృందం పరిశీలించింది.
నిజామాబాద్అర్బన్, న్యూస్లైన్ : జిల్లా మెడికల్ కళాశాలను శనివారం ఎంసీఐ బృందం పరిశీలించింది. కళాశాలలో రెండో సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతి ఇచ్చే విషయమై ఎంసీఐ బృంద సభ్యులు డాక్టర్ వీఎన్.త్రిపాఠి, డాక్టర్ రంగనాథ్ వచ్చారు. ఉదయం 9 గంటలకే కళాశాలకు చేరుకొని సాయంత్రం 5.30 గంటల వరకు ఉన్నారు. కళాశాలలోని ప్రొఫెసర్ల విభాగాలు, గ్రంథాలయం, పరీక్షల గదులు, ఆడిటోరియం, తరగతి గదులు, వసతి గృహాలను తనిఖీ చేశారు.
అధికారులతో సమావేశమై విద్యార్థులకు కల్పించిన సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. జిల్లా ఆ స్పత్రిలోని అత్యవసర విభాగం, గైనిక్ విభాగం, పిల్లల వార్డు, ఆర్థోపెడిక్, ఓపీ విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి ‘ఆస్పత్రిలో ఎంత మంది రోగులున్నారు. వారికి అందుతున్న వైద్యసేవలు ఎలా ఉన్నాయి’ వంటి వివరాలు తెలుసుకున్నారు. ఎనిమిదో అంతస్తులోని విభాగాలను, మెడికల్ కళాశాలకు సంబంధించిన నివేదికలను, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల వివరాలను, ఆస్పత్రిలో వైద్యసేవలు అందించే తీరును పరిశీలించి వెళ్లారు.
రెండోసారి..
మెడికల్ కళాశాలలో రెండో సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతి ఇచ్చే విషయమై ఎంసీఐ బృందం ఈ ఏడాది ఫిబ్రవరి 23, 24 తేదీల్లో కళాశాలను సందర్శించిన విషయం తెలిసిందే. కళాశాలలో గ్రంథాలయం సక్రమంగా లేకపోవడం, ప్రొఫెసర్ల కొరత తదితర కారణాలతో రెండో సంవత్సరానికి అనుమతి నిరాకరించారు. దీంతో కళాశాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులు నిరసనకు దిగారు. అధికారుల విజ్ఞప్తితో ఎంసీఐ బృందం రెండోసారి కళాశాలకు వచ్చింది. ఇద్దరు సభ్యుల బృందం ఇచ్చే నివేదికపైనే కళాశాల భవితవ్యం ఆధారపడి ఉంది.