ఎంటెక్ విద్యార్థిని ఆత్మహత్య | m tech student ends life self in warangal district | Sakshi
Sakshi News home page

ఎంటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Oct 15 2014 1:06 AM | Updated on Nov 9 2018 4:36 PM

ఎంటెక్ విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

ఎంటెక్ విద్యార్థిని ఆత్మహత్య

ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలని ఓ మృగాడు వేధిస్తుండడంతో తాళలేని ఎంటెక్ విద్యార్థిని మరణశాసనం రాసుకుంది.

* పెళ్లి చేసుకోవాలని మృగాడి వేధింపులు..
 
లింగాలఘణపురం: ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలని ఓ మృగాడు వేధిస్తుండడంతో తాళలేని ఎంటెక్ విద్యార్థిని మరణశాసనం రాసుకుంది. తనతో తీయించుకున్న ఫొటోలు చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేయడంతో మనోవేదనకు గురై మంగళవారం ఉదయం క్రిమిసంహారక మందు తాగింది. వివరాలు పోలీసుల కథనం ప్రకారం...

వరంగల్ జిల్లా లింగాల ఘనపురం మండలం వడిచర్ల గ్రామానికి చెందిన వంగ ఉప్పలయ్య- పద్మల కుమార్తె విజయలక్ష్మి (23) అలియాస్ విజయ జనగామలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలో ఎంటెక్ సెకండియర్ చదువుతోంది. అదే కళాశాలలో ఎంటెక్ పూర్తి చేసిన దేవరుప్పుల వాసి గొడిశాల రజినీకర్ చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం ఇప్పిస్తానని విజయలక్ష్మి వద్ద అప్పట్లో పాస్‌పోర్టు సైజు ఫొటోలతో పాటు ఆమె మిత్రులతో కలిసి తీయించుకున్న ఫొటోలు తీసుకున్నాడు. అప్పటి నుంచి విజయలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ తన వద్ద ఉన్న ఫొటోలను కుటుంబ సభ్యులకు చూపిస్తానని బెదిరిస్తున్నాడు.

పెళ్లికి తన కుటుంబ సభ్యులు అంగీకరించరని విజయలక్ష్మి వ్యతిరేకించింది. తాను ‘మీ కుటుంబ సభ్యులను ఒప్పిస్తానని’ ఒత్తిడి చే స్తుండడంతో మనోవేదనకు గురైంది. ఈ నెల 13న హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్న తన తమ్ముడు వినోద్‌కు ఫోన్ చేసి తనను రజినీకర్ పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని వాపోయింది. మరుసటిరోజే  మంగళవారం ఉదయం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. రజినీకర్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి పెట్టింది. తమ కూతురు ఆత్మహత్యకు రజినీకర్ వేధింపులే కారణమని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
సూసైడ్ నోట్
‘తనను ఓ యువకుడు వేధిస్తున్నాడు, ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద ఫొటోలు, రెజ్యూమ్ తీసుకుని వెంటబడుతున్నాడు. తాను జీవితంలో చేసిన తప్పు ఆ యువకుడితో మాట్లాడడమే, నాన్న అమ్మను మంచిగా చూసుకో, తమ్ముడూ మంచిగా చదువుకుని ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నను చూడు. తాత ఆరోగ్యం కోసం కూడా చూడండి. మీతో ఉండాలని ఉంది. అయినా.. మిమ్ములను మిస్సవుతున్నందుకు బాధగా ఉంది’ అని సూసైడ్ నోట్‌లో రాసింది.

Advertisement
 
Advertisement
Advertisement