పదోన్నతుల పాకులాట | lobbying Promotions postings in Power department | Sakshi
Sakshi News home page

పదోన్నతుల పాకులాట

Oct 25 2017 3:28 PM | Updated on Oct 17 2018 6:06 PM

lobbying Promotions postings in Power department - Sakshi

కొందరు పోస్టింగ్‌ కోసం వేచిచూస్తున్నారు. మరికొందరు పదోన్నతి కోసం పైరవీలు చేస్తున్నారు. వెరసి విద్యుత్‌ శాఖలో పనులు మాని పదోన్నతులు, పోస్టింగుల కోసం పాకులాడుతున్నారు. ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధుల చుట్టూ చక్కర్లు కొడుతూ వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. అయితే శాఖలో అర్హులకు న్యాయం జరుగుతుందా అన్నది పెద్ద ప్రశ్నగా మిగులుతోంది.

నిజామాబాద్‌నాగారం: విద్యుత్‌శాఖలో పదోన్నతుల జాతర కొనసాగుతోంది. యూనియన్‌ల నాయకులు అధికారులపై తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం నిర్వహించే యూడీసీ నుం చి జూనియర్‌ అకౌంట్‌ ఆఫీసర్‌(జేఏవో) సంబంధించి 32 పోస్టులకు పదోన్నతులు కల్పించి మూన్నెళ్లు అయ్యింది. పోస్టింగ్‌లు మాత్రం ఇవ్వలేదు. దీంతోపాటు ఏఈ నుం చి ఏడీఈ పదోన్నతుల కోసం ఇప్పటికే జాబితాలో పేర్లు ఉన్నవారు పైరవీలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇది వరకే వరంగల్‌లో ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌రావు 48 జేఏవో నుంచి అసిస్టెంట్‌ అకౌంట్‌ ఆఫీసర్‌(ఏఏవో)గా పదోన్నతులు కల్పించారు. రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా పారదర్శంగా పదోన్నతులు పోస్టింగ్‌లిచ్చి శభాష్‌ అనిపించుకున్నారు. ఆయన బుధవారం ఇక్కడికి రానున్నారు. దీంతో ఇక్కడ ఎలా జరుగుతుందోనన్న సందిగ్ధం నెలకొంది. 

29 మందికి పదోన్నతులు 
నిజామాబాద్‌ విద్యుత్‌శాఖ సర్కిల్‌ పరిధిలో 29 మందికి పదోన్నతులు కల్పించారు. కామారెడ్డి, నిజామాబాద్‌ రెండు జిల్లాలకు కలిపి మొత్తం 29 మంది ఎల్‌డీసీ నుంచి యూడీసీ పదోన్నతులు ఎస్‌ఈ కల్పించారు. సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్‌ నిర్వహించి ఈ పదోన్నతులవారికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఆ నేత కోసమే..
నిజామాబాద్‌ సర్కిల్‌ పరిధిలో మొత్తం 32 జేఏవో పదోన్నతులకు యూడీసీ వారికి జిల్లాశాఖ అధికారి ప్రభాకర్‌ డీపీసీ ద్వారా కల్పించారు. అయితే పోస్టింగ్‌లు మాత్రం ఇవ్వలేదు. ఇందుకు ప్రధాన కారణం జేఏవో పోస్టుల్లోనివారికి ఏఏవోగా పదోన్నతి కల్పిండంలో సీనియారిటీ దెబ్బతింటుందని. ఇవి మూన్నెళ్ల క్రితమే ఇ వ్వడంతో ఓ ప్రధాన కార్మిక సం ఘం నేతకు భారీగా లబ్ధి చేకూరింది. ఈ పదోన్నతులు కేవలం ఆ సంఘం నేత కోసమే జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి.

త్వరలోనే ఏఈలకు పదోన్నతులు
రెండు నెలలుగా ప్రధాన పోస్టుల కోసం పైరవీలు చేస్తూనే ఉన్నారు. వరంగల్‌ పరిధిలో మొత్తం 5 సర్కిళ్లలో 160 ఏడీఈ పోస్టులకు పదోన్నతులు రానున్నాయి. వీరిలో ఆంధ్రవారికి 43 పోగా మిగతా 117 పోస్టులకు పదోన్నతులు కల్పించాలి. ఏఈ నుంచి ఏడీఈగా మారేందుకు ఎవరికి వారే పనులు పక్కనబెట్టి పైరవీలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, వరంగల్‌ ఉన్నతాధికారుల దగ్గరికి చక్కర్లు కొడుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్‌ నగరంలో టౌన్‌–2 సెక్షన్‌ ఏర్పడనుండడంతో అదనంగా ఏడీఈ పోస్టు రానుంది. దీని కోసం జిల్లాలో సుమారుగా 15మంది ఏఈలు తీవ్రంగా పైరవీలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement