ఆస్పత్రికి వెళ్తున్న ఓ మహిళపై తోటి మహిళలే మీదపడి బంగారం చైన్ తస్కరించారు. మెడలో నుంచి చైన్ దొంగలించినట్లు గమనించిన ఆ మహిళ అప్రమత్తమై కేకలు వేసింది.
నిజామాబాద్క్రైం, న్యూస్లైన్ : ఆస్పత్రికి వెళ్తున్న ఓ మహిళపై తోటి మహిళలే మీదపడి బంగారం చైన్ తస్కరించారు. మెడలో నుంచి చైన్ దొంగలించినట్లు గమనించిన ఆ మహిళ అప్రమత్తమై కేకలు వేసింది. దీంతో ఓ కానిస్టేబుల్ వెంటపడి దొంగను పట్టుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని చంద్రనగర్కు చెందిన అంబట్ల సునీతతోపాటు మరొకరు సోమవారం ఉదయం ఖలీల్వాడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ఆటోలో వచ్చారు. అదే ఆటోలో తమిళనాడుకు చెందిన నలుగురు మహిళలు ఎక్కారు. ఆటో ఖలీల్వాడికి వచ్చేంతలోపు ఈ ముఠా మూడుసార్లు సునీతపై పడినట్లు నటించి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ కత్తిరించారు.
చైన్ ఆటోలోనే కిందపడిపోయింది. దాన్ని ముఠాలోని ఓ మహిళ తీసుకుంది. సునీత మెడలో చైన్ లేక పోవటాన్ని గమనించిన సహచర మహిళ ఆమెకు చెప్పింది. దీంతో సునీత ఆటోలో ఉన్న మహిళలతో మీరే నా చైన్ దొంగలించారంటూ కేకలు పెట్టింది. కంగారు పడిన ముఠా సభ్యులు చైన్ను కింద పారేసి తలోదిక్కుకు పారిపోతుండగా అక్కడి కళాశాల వద్ద పరీక్ష బందోబస్తు నిర్వహిస్తున కానిస్టేబుల్ హైమద్ వారి వెంటపడి ఒకరిని పట్టుకున్నాడు. మిగతా ముగ్గురుని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ నలుగురి ముఠా సభ్యులను ఒకటోటౌన్ కు తరలించారు. వీరి గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం.