‘ప్రజల అవసరాలు తీర్చడం ప్రభుత్వ బాధ్యత’ | KTR Participate In Mana Nagaram Programme At LB Nagar | Sakshi
Sakshi News home page

‘ప్రజల అవసరాలు తీర్చడం ప్రభుత్వ బాధ్యత’

Jun 14 2018 1:16 PM | Updated on Sep 4 2018 5:48 PM

KTR Participate In Mana Nagaram Programme At LB Nagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగర అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయలనే ఉద్దేశంతో చేపట్టిన ‘మన నగరం’ కార్యక్రమం గురువారం ఎల్బీనగర్‌‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగోల్‌లో ఇంకుడు గుంతల ఏర్పాటు, హరితహారంలో భాగంగా జరుగుతున్న మొక్కల పెంపకాన్ని కేటీఆర్ పరిశీలించి మాట్లాడుతూ.. ‘ప్రజల అవసరాలు తీర్చడం ప్రభుత్వం బాధ్యత. హైదరాబాద్‌లో 10 జోన్లు, 50 డివిజన్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నమన్నారు. ప్రతి మూడు డివిజన్‌లకు ఓసర్కిల్, 15 డివిజన్‌లకు ఓజోన్‌ను ఏర్పాటు చేస్తాం. మీ పన్నులకు మేము ధర్మకర్తలం మాత్రమే. రోజు గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి మనిషి అరకిలో చెత్త ఉత్పత్తి  చేస్తున్నారు. ఇలా మొత్తం 500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. తడి, పొడి చెత్త బుట్టలను తప్పకుండా వాడండి. తడి చెత్తతో ఎరువు తయారు చేసి చెట్లకు వాడొచ్చు. నాలాల్లో పూడిక తీస్తుంటే.. అంతరిక్షంలో పరిశోధన చేసినా దొరకని వస్తువులు మన నాళాల్లో దొరుకుతున్నాయి. ప్లాస్టిక్, పరుపులు.. ఇలా ఏవేవో వేస్తున్నారు.

మరోవైపు ఇంకుడు గుంతలు లేకపోవడంతో వేయి అడుగుల వరకు బోర్లు వేసినా నీరు రావడం లేదు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని జలం- జీవంను కార్యక్రమం​ ప్రారంభించాం. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే ఆస్తి పన్నులో రాయితీ ఇస్తాం.పార్కులు కబ్జాకు గురికాకుండా అడ్డుకోండి.. చెరువులు కాపాడండి అని అందరూ కోరుతున్నారు. పార్కులు అభివృద్ధి చేస్తాం.. మీరు వాటిని దత్తత తీసుకుని వాటిని చూసుకోండి. గ్రేటర్ హైదరాబాద్ లో 10 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటుకు  టార్గెట్ పెట్టుకున్నాం.. ఇప్పటికీ 3 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాం. కోటి 80 లక్షల మంది ఉన్న టోక్యోలో లో రోడ్లపైన ఎక్కడా చెత్త ఉండదు. అక్కడ ఎవ్వరూ రోడ్లపై చెత్త వేయరు. గ్రేటర్ హైదరాబాద్‌లో రోజుకు రెండు వేల ఎమ్‌ఎల్‌డీ మురుగు నీరు ఉత్పత్తి అవుతోంది. కానీ 600  ఎమ్‌ఎల్‌డీల మురుగు నీరు వెళ్ళే ఎస్‌టీపీలు మాత్రమే ఉంది. వంద కంటే ఎక్కువ ప్లాట్స్ ఉన్న అపార్ట్‌మెంట్ వాళ్లు మినీ ఎస్‌టీపీ ఏర్పాటు చేసుకోవాలి’ అని తెలిపారు

నాగోల్‌లోని దేవకి కాన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రి మహేందర్‌రెడ్డి, న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, ఎంపీ మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్‌.కృష్ణ‌య్య‌, తీగ‌ల కృష్ణారెడ్డి, వివిధ శాఖల అధికారులు, వివిధ కాలనీలకు చెందిన సిటిజన్స్ పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement