ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో కీలక రంగాలు | Key sectors of the World Industrial Conference | Sakshi
Sakshi News home page

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో కీలక రంగాలు

Nov 24 2017 2:17 AM | Updated on Nov 24 2017 2:17 AM

Key sectors of the World Industrial Conference - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్‌)–2017 కేవలం నాలుగు రంగాలకు ప్రాధాన్యమిస్తోంది. కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలతో ఔత్సాహికులు స్థాపించిన పలు పరిశ్రమలు ప్రపంచ గమనాన్ని మార్చేశాయి. ఉద్యోగాల కల్పనతో పాటు ఉత్పాదకతను పెంచుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయి.

ఈ నేపథ్యంలో శరవేగంగా వృద్ధి చెందే అవకాశాలున్న రంగాలకే ఈ ఏడాది సదస్సులో ప్రాధాన్యమివ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. హెల్త్‌కేర్‌–లైఫ్‌ సైన్సెస్, డిజిటల్‌ ఎకానమీ–ఫైనాన్షియల్‌ టెక్నాలజీ, ఎనర్జీ–ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మీడియా–ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఈ నాలుగు రంగాలపైనే ప్రధానంగా జీఈఎస్‌ ఎనిమిదో ఎడిషన్‌ ఫోకస్‌ చేస్తోంది. వీటిపైనే చర్చలు, మాస్టర్‌ క్లాస్‌లు జరిగేలా సదస్సుకు ఎజెండాను సిద్ధం చేసుకుంది.

ఆరోగ్యమే భవిష్యత్తు..
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఆరోగ్య పరిరక్షణ రంగం వేగంగా విస్తరిస్తోంది. వ్యాధులు, ప్రమాదాలు, విపత్తుల బారిన పడితే ప్రాణాలను రక్షించటంతో పాటు సత్వర వైద్య సేవలు, మెరుగైన ఆరోగ్యం, జీవిత కాలం పెంపు దిశగా ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలు, పరిశ్రమలకు అపారమైన అవకాశాలున్నాయి. అందుకే హెల్త్‌కేర్, ఫ్యూచర్‌ హెల్త్‌ రంగాల్లో పెట్టుబడులు, ఆరోగ్య రంగంలో అధునాతన శాస్త్ర విజ్ఞానం, తక్కువ పెట్టుబడితో సాధ్యమయ్యే అవకాశాలను సదస్సులో చర్చిస్తారు.

నగదు రహిత ప్రపంచం..
డిజిటల్‌ ఎకానమీ దిశగా ప్రపంచంలో వస్తున్న మార్పులపై ఈ సదస్సు ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. బ్యాంకింగ్‌ సేవలు, వినియోగదారులను జాగృత పరిచేలా డిజిటల్‌ సేవలు, నగదు రహిత విధానాలు, అవినీతిని నిరోధించటం, లావాదేవీలకయ్యే ఖర్చులను తగ్గించటంతో పాటు ఆర్థిక ప్రగతికి దోహదపడే సాంకేతిక పరిజ్ఞానం దిశగా పెట్టుబడులను ప్రోత్సహించనుంది.

2020 నాటికి ప్రపంచంలో 600 కోట్ల మంది స్మార్ట్‌ ఫోన్లను వినియోగించనున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో అదే స్థాయిలో డిజిటల్‌ ఎకానమీ సైతం విస్తరించి వినియోగదారులందరికీ సేవలందించటం తప్పనిసరవుతుంది. ఆర్థిక రంగంలోనూ అదే దిశగా మార్పులు రావాలి. ఆన్‌లైన్, కార్డుల తరహాలో నగదు రహిత చెల్లింపుల దిశగా విప్లవాత్మకమైన మార్పు సాధించే దిశగా అవసరమైన ఆలోచనలన్నీ పెట్టుబడులకు ఊతమిస్తాయి.

స్మార్ట్‌ వస్తు సేవలు..
ప్రపంచవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనలో అధునాతనమైన వసతులు, సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. వనరులను అత్యధికంగా సద్వినియోగం చేసుకోవటం, వృథాను అతి తక్కువ స్థాయికి తగ్గించే దిశగా పరిశోధనలు జోరందుకున్నాయి. స్మార్ట్‌ సిటీలు, సమాజంలో వస్తున్న మార్పులన్నీ వస్తు సేవల వినియోగంపై ప్రభావం చూపుతున్నాయి. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ మౌలిక వసతుల కల్పనలో వచ్చిన మార్పులకు అనుగుణంగా పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నాయి. అధునాతన మొబైల్‌ వసతులు, భవిష్యత్తులో కొరత రాకుండా నీటి నిర్వహణ, ఇంధన వినియోగం, భవిష్యత్తు పట్టణాలు, నగరాలు, రీసైక్లింగ్‌ విధానంతో చెత్తను సద్వినియోగం చేసుకునే పరిజ్ఞానంపై ఈ సదస్సులో చర్చిస్తారు.

ఇంటి నుంచే హాలీవుడ్‌.. బాలీవుడ్‌..
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మీడియా, కళలు, వినోద రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రజలకు సమాచారం చేరటంతో పాటు ఆలోచనలను పంచుకునేందుకు, కొత్త విషయాలను నేర్చుకునేందుకు డిజిటల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది.

మీడియాలో వచ్చిన ఈ పెను మార్పుతో దశాబ్దం కిందట లేనటువంటి కొత్త ఉద్యోగాలు, కొత్త మార్కెట్, కొత్త రాబడులకు ఆస్కారం ఏర్పడింది. వీటితో పాటు సినిమాలు, సంగీతం, మీడియా రంగం సంస్కృతులను, సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇంటి నుంచి హాలీవుడ్, బాలీవుడ్‌ అన్నట్లుగానే ఇండియా, అమెరికా ఈ రంగంలో కీలక స్థానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూవీ మేకింగ్‌తో పాటు క్రియేటివ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మీడియా రంగంలో మహిళలకు అవకాశాలపై ఈ సదస్సు ప్రాధాన్యమిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement