
సాక్షి, హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసే ప్రసక్తి లేదని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ లౌకిక పార్టీగా కొనసాగుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ ఉన్న సీట్లను కాపాడుకుంటే గొప్పని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నేతలు లేనిపోనివి ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమ పార్టీతో పొత్తు ఉండదని స్వయంగా బీజేపీ చీఫ్ అమిత్ షా చెప్పారని కేసీఆర్ గుర్తుచేశారు. మతతత్వ ఎంఐఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరించే పార్టీతో పొత్తు పెట్టుకోబోమని అమిత్ షానే అన్నారని చెప్పారు.
రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి జేడీ(యూ) అభ్యర్థికి మద్దతివ్వడం నితీష్తో తనకున్న స్నేహమే కారణమని, స్వయంగా ఆయన తనకు ఫోన్ చేసి మద్దతు కోరినందునే సహకరించామని చెప్పారు. అది అంశాలవారీగా తీసుకున్న నిర్ణయమేనని రాజకీయంగా తమది సెక్యులర్ పార్టీని, అలాగే కొనసాగుతామని స్పష్టం చేశారు.