నేడు నిజామాబాద్‌కు కీసీఆర్‌ | Sakshi
Sakshi News home page

నేడు నిజామాబాద్‌కు కీసీఆర్‌

Published Wed, Oct 3 2018 11:01 AM

KCR Meeting In Nizamabad - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత,  ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నేడు జిల్లాకు రానున్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికి గులాబీ బాస్‌ జిల్లా నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఈ తొలి ప్రచార సభను ఆ పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నగరం లోని గిరిరాజ్‌ కళాశాల మైదానంలో  బహిరంగసభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ వేదికను నిర్మించారు. సభా స్థలాన్ని సర్వాం గ సుందరంగా తీర్చిదిద్దారు. మైదానాన్ని చదును చేసి బారికేడ్లను నిర్మించారు.

టీఆర్‌ఎస్‌ జెండాలు, తోరణాలతో నగరమంతా గులాబీ మయంగా మారింది. అధినేత కేసీఆర్, ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలతో కూడి న భారీ కటౌట్‌లను ఏర్పాటు చేశారు. సీఎం బహిరంగ సభా నిర్వహణ బాధ్యతలను భూజానెత్తుకున్న ఎంపీ కవిత, పోచారం శ్రీనివాస్‌రెడ్డి వారం రోజులుగా జిల్లాలోనే ఉండి పర్యవేక్షించా రు. సభకు తరలివచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. సభలో తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు రాక.. 
కేసీఆర్‌ మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్‌కు చేరుకుంటారు. హెలిక్యాప్టర్‌లో నేరుగా సభా స్థలానికి వస్తారు. ఇందుకోసం సభా స్థలం వద్ద హెలిప్యాడ్‌ను నిర్మించారు. వచ్చిన వెంటనే కొద్దిసేపు పార్టీ అభ్యర్థులతో సమీక్షిస్తారు. అనంతరం బహిరంగసభా వేదిక పైకి వచ్చి జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సభ అనంతరం తిరిగి హైదరాబాద్‌ బయలుదేరి వెళతారు. 

భారీ జన సమీకరణ.. 
బహిరంగసభను టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విజయవంతం చేసేందు కు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు తొలి ప్రచార సభ కావడంతో ఆ పార్టీ ఈ బహిరంగసభపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒక్కో నియోజకవర్గం నుంచి 25 వేల మంది చొప్పున జన సమీకరణ చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు తాజామాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ అభ్యర్థులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సభకు భారీగా తరలిరావాలని గ్రామాలు, నగరంలోని వివిధ డివిజన్లలో ఇం టింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మైక్‌ల ద్వారా ప్రచారం చేశారు. 

నాలుగు జిల్లాల నుంచి వెయ్యి ఆర్టీసీ బస్సులు.. 
భారీ జన సమీకరణలో నిమగ్నమైన టీఆర్‌ఎస్‌ వర్గాలు ఆర్టీసీ బస్సులతో పాటు, ప్రైవే టు వాహనాలను వినియోగిస్తున్నారు. నిజామాబాద్‌తో పాటు, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్‌ ఆర్టీసీ రీజియన్ల నుంచి సుమారు వెయ్యి బస్సులను బుక్‌చేశారు. అలాగే డీసీఎంలు, ఇతర ప్రైవేటు వాహనాలను గ్రామా ల్లో అందుబాటులో ఉంచి జన సమీకరణ చేపట్టారు. ప్రతి గ్రామానికి ఒకటీ రెండు వాహనాలను అందుబాటులో ఉంచారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement