సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన | Kamareddy Collector Inspects Arrangements For CM Visit | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

Oct 2 2019 8:53 AM | Updated on Oct 2 2019 8:53 AM

Kamareddy Collector Inspects Arrangements For CM Visit - Sakshi

కోమలంచ శివారులో మొక్కను నాటుతున్న కలెక్టర్, ఎస్పీ

సాక్షి, నిజాంసాగర్‌: నాగమడుగు ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రానుండడంతో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. సీఎం ఈనెల 11, 12, 13, 14 తేదీలలో జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. మంగళవారం కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్పీ శ్వేత, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌లు నిజాంసాగర్‌ మండలంలో పర్యటించారు. నిజాంసాగర్‌ మండలంలోని ఒడ్డేపల్లి, జక్కాపూర్‌ గ్రామాల శివారులో ఉన్న మంజీర నదిపైన రూ. 476.2 కోట్లతో నాగమడుగు ఎత్తిపోతల పథకం నిర్మించాలని సంకల్పించిన విషయం తెలిసిందే.. ఈ పథకం ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాన్సువాడ పట్టణం నుంచి బస్సు ద్వారా వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఈ మార్గాన్ని కలెక్టర్, ఎస్పీ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్లపొదల తొలగింపు, హరితహారం మొక్కలు నాటడం, వాటి చుట్టూ ట్రీగార్డుల ఏర్పాటు పనులపై అధికారులకు సూచనలిచ్చారు. వారి వెంట బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్, డీఎల్‌పీవో శ్రీనివాస్, ఎంపీడీవో పర్బన్న, ఈజీఎస్‌ ఏపీవో సుదర్శన్, కోమలంచ సర్పంచ్‌ అనురాధ, ఎంపీటీసీ బండారు లక్ష్మి తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement