నిజామాబాద్ నగరంలో రేషన్దుకాణాల బైఫరికేషన్(విభజన) జరిగేనా ? అన్న అనుమానాలు మొదలయ్యాయి.
ప్రగతినగర్ : నిజామాబాద్ నగరంలో రేషన్దుకాణాల బైఫరికేషన్(విభజన) జరిగేనా ? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఒక్కో రేషన్ దుకాణాల్లో సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు తెల్లకార్డులు ఉన్నాయి. పేదల బియ్యం పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు గత జేసీ వెంకటేశ్వరరావు బైఫరికేషన్కు ఆదేశాలు జారీ చేశారు.
అయితే రేషన్ డీలర్ల సంఘం నేతల ఒత్తడితో ఎలాంటి ముందడుగు పడలేదు. కాగా శనివారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ పార్థ సారథి జిల్లాలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనైనా రేషన్ దుకాణాల బైఫరికేషన్ సమస్య తేలిపోతుందని చిన్న డీలర్లు ఆశాభావంతో ఉన్నారు. దీంతోపాటు జిల్లాలో ఆధార్ సీడింగ్లో అవకతవకలు, బోగస్ కార్డులు, ఇటీవలే జిల్లాలో రూపాయి బియ్యన్ని రీసైక్లింగ్కు పంపిస్తూ బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ పట్టుబడ్డ రేషన్ డీలర్ల అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది.
అసలు ఈ రేషన్ దుకాణాల బైఫరికేషన్ 2008 సంవత్సరంలోనే నిర్వహించాల్సి ఉంది. అయితే అప్పట్లో జిల్లాకు చెందిన కాంగ్రెస్ బడానేతను రేషన్ డీలర్లు ఆశ్రయించగా షాపుల విభజనను అడ్డుకున్నట్లు ప్రచారం జరిగింది. తిరిగి 2011 సంవత్సరంలో నగరంలోని రేషన్ షాపులను బైఫరికేషన్ చేయాలని అప్పటి జేసీ నీతూ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆమె ఆదేశాలు సైతం ధిక్కరించి అధికారులు రేషన్ డీలర్ల సంఘంతో కుమ్మకై బైఫరికేషన్కు సవాలక్ష సమస్యలు ఉన్నాయని తప్పుదోవ పట్టించారు.
తాజాగా ఇటీవల నగరంలోని రేషన్ దుకాణాలను బైఫరికేషన్ చేయాలని బదిలీపై వెళ్లిన జేసీ వెంకటేశ్వర్రావు ఆదేశాలు జారీ చేశారు. బైఫరికేషన్ చేస్తే ఎక్కడ తమ ఆదాయం తగ్గిపోతుందోనని భావించిన డీలర్ల సంఘం నేతలు వీలైనంత మేరకు బైఫరికేషన్ను కానివ్వకుండా అడ్డుతగులుతున్నారు. ప్రస్తుతం రేషన్ డీలర్ల సంఘంలో ప్రధానపాత్ర పోషిస్తున్న కొంద రు నాయకులకు నెలకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల ఆదాయం రేషన్ దుకాణాల ద్వారా వస్తున్నట్లు తెలిసింది. సంఘంలో ఉన్న ప్రధాన డీలర్లకు ఒక్కొక్కరి షాపులో 4 వేల నుంచి 5 వేల వరకు కార్డులు ఉన్నాయి.
వీటి ద్వారా రూపాయి బియాన్ని పక్కదారి పట్టించి ప్రతినెల లక్షల రుపాయల నిరుపేదల నోటికాడి కూడును కాజేస్తున్నారు. అయితే రేషన్ షాపుల బైఫరికేషన్ జరిగితే వీరి ఆదాయానికి ఎక్కడ చెక్ పడుతుందోనని బెంబేలెత్తుతున్నారు. దీని కోసం వీరు ఇటీవలె రైల్వేస్టేషన్ వద్ద గల ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశమైనట్లు సమాచారం. షాపుల బైఫరికేషన్కు అడ్డుతగలాలని లేనిఎడల తమ ఆదాయానికి గండి పడుతుందని సమావేశంలో మాట్లాడుకున్నట్లు తెలిసింది. దీని కోసం ఎక్కువ కార్డులు ఉన్న వారి దగ్గర డబ్బులు వసూలు చేసి బైఫరికేషన్ నోటిఫికేషన్ నిలుపుదలకు పెద్ద ఎత్తున పన్నాగం పన్నినట్లు సమాచారం అందుతోంది.
బైఫరికేషన్ నిలుపుదలకు సంబంధిత అధికారి వద్ద బేరసారాలు కూడా నడిచాయని అంటున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పట్టణాల్లో ఒక్కో రేషన్ షాపుల్లో 650 నుండి 700 కార్డులు, గ్రామాల్లో నైతే 400 నుండి 500 కార్డులు మాత్రమే ఉండాలని స్పష్టమైనా ఆదేశాలు జారీ చేసింది. అయితే గత నెలలోనే ఇదంతా జరిగింది. ఎన్నికలు ముగిసిన వెంటనే నగరంలోని రేషన్ షాపుల బైఫరికేషన్కు ఆదేశాలు ఇచ్చింది. నగరంలో ప్రస్తుతం ఉన్నా 87 షాపులకు తోడు మరో 29 కొత్త రేషన్దుకాణాలకు నోటిపికేషన్ విడుదల చేయాలని ఉత్తర్వులు కూడా అందాయి.
అంతే అంతలోనే తిరిగి సంబంధిత అధికారిపై డీలర్ల సంఘం నాయకులు రాజకీయ ఒత్తిళ్లు పెంచారు. అధికార పార్టికి చెందిన మంత్రి, ఓ ఎమ్మెల్సీలు కలిసి బైఫరికేషన్ను నిలిపివేయాలని సంబంధిత అధికారికి సూచించినట్లు తెలిసింది. కాగా సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో ముఖ్యమైన నేతలు, అధికారులకు రేషన్ డీలర్లే భోజన ఖర్చులు చూసుకున్నట్లు ప్రచారం కూడా ఉంది. అవినీతి రహిత సమాజం నిర్మిస్తామని గూలాబీ దళపతి ఓ దిక్కు గొంతు పోయేలా అరుస్తుంటే కిందిస్తాయి శ్రేణులు మాత్రం అవినీతిపరులతో చేతులు కలిపుతున్నారని అపుడే ఆరోపణలు మొదలయ్యాయి.