Sakshi News home page

రేషన్‌కార్డులను మించిన ‘ఆహార భద్రత’ దరఖాస్తులు!

Published Wed, Oct 22 2014 12:04 AM

huge food security applications

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆహార భద్రతాకార్డుల కోసం లెక్కకు మంచిన దరఖాస్తులు రావడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో ఆహారభద్రత(రేషన్) కార్డుల కోసం దరఖాస్తుల సంఖ్య 21.88 లక్షలకు చేరింది. గత రెండు నెలల నుంచి ఆధార్ అనుసంధానం కొనసాగుతుండడంతో బోగస్‌కార్డులకు అడ్డుకట్టపడి...15.62 లక్షల తెల్ల కార్డులు మాత్రమే మిగిలాయి.

అయితే వీటి స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ఆహారభద్రతా కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొనడంతో దరఖాస్తులు వెల్లువెత్తాయి. తెల్లకార్డుల సంఖ్యకంటే మరో 6.26 లక్షల దరఖాస్తులు పెరిగినట్లయింది. దరఖాస్తు చేసుకునేందుకు గడువు వెసులుబాటుతో మరో లక్ష వరకు సంఖ్య పెరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆహార భద్రత నిబంధనలతోపాటు కేవలం నిత్యావసర సరుకులకే కార్డు పరిమితం కానున్నడంతో మరో 20 శాతం కార్డుదారులు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి కనబర్చలేదు.
 
గతంలో ఇదీ పరిస్థితి...
తెలంగాణ రాష్ర్టం ఏర్పాటయ్యేనాటికి హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో తెల్లరేషన్ కార్డుల సంఖ్య 17.87 లక్షలు మాత్రమే. అంతకు ముందు జరిగిన రచ్చబండ-3లో సుమారు 1.77 లక్షల నిరుపేద కుటుంబాలు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి.  కాగా, తాజాగా ఉన్న కార్డులనే వడబోసి, ఆధార్ అనుసంధానంతో బోగస్‌లను గుర్తించి కొన్నింటిని రద్దుచేశారు. దీంతో తెల్ల రేషన్ కార్డుల సంఖ్య 15.62 లక్షలకు చేరింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement