ఈ నెల 20లోగా ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని సూచన
లేదంటే వచ్చే నెల కోటా నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: ఆహారభద్రత కార్డులోని సభ్యులందరికీ ఈ కేవైసీ తప్పనిసరి చేసిన పౌర సరఫరాల శాఖ తాజాగా కొత్త సభ్యులపై దృష్టి సారించింది. కొత్త రేషన్కార్డుల మంజూరు, పాత కార్డులో కొత్తసభ్యుల ఆమోదం ప్రక్రియ కొనసాగుతున్నందున కొత్త సభ్యులు సైతం ఈ కేవైసీ చేసుకోవాలని ఆదేశించింది. రేషన్కార్డులో పేర్లున్న కుటుంబ సభ్యులందరూ దగ్గరలోని రేషన్ దుకాణానికి వెళ్లి ఈ–పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు అప్డేట్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చౌకధరల దుకాణాల డీలర్లు సైతం రేషన్ కోటా డ్రా కోసం వస్తున్న లబ్ధిదారులకు ఈ కేవైసీ(e-KYC) గురించి గుర్తు చేస్తున్నారు.
వాస్తవంగా గత రెండేళ్లగా ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికీ పలు మార్లు గడువు పెంచుకుంటూ వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే డుబ్లికేట్, చనిపోయిన యూనిట్లు ఎరివేతకు గురికాగా, మిగిలిన వాటిలో దాదాపు 85 శాతం ఈ–కేవైసీ పూర్తయింది. ఈ నెల 20లోగా ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోకుంటే సదరు యూనిట్ల రేషన్ కోటా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆధార్కు ఈ–పాస్ యంత్రానికి అనుసంధానం చేయడంతో బినామీ పేర్ల మీద బియ్యం (Rice) తీసుకోకుండా అడ్డుకట్ట వేయడం సులభం అవుతుంది. దీనితో చౌకధరల దుకాణాల్లో బియ్యం పంపిణీ మరింత సమర్ధవంతంగా అమలు చేయవచ్చనే ఉద్దేశంతో ఈ–కేవైసీ నిబంధన తప్పనిసరి చేసినట్లు కనిపిస్తోంది.

అప్డేట్ లేక తిప్పలు
ఆధార్ నవీకరణ(అప్డేట్) లేక బయోమెట్రిక్ వల్ల కొందరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు ఆధార్ కేంద్రాలకు వెళ్లి అప్డేట్ ప్రక్రియ పూర్తి చేయించుకున్నప్పటికీ ఈ–కేవైసీ ప్రక్రియలో వేలిముద్రలు రావడం లేదు. ఆధార్ అప్డేట్ పూర్తి కాకపోవడంతో ఈ–కేవైసీ తీసుకోవడంలేదని వారు పేర్కొంటున్నారు. దీంతో లబ్ధిదారులు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆధార్ (Aadhaar) నవీకరణ పూర్తి కాకపోవడంతో చిన్నారులు ఈ–కేవైసీ ప్రక్రియకు దూరమవుతున్నారు.
చదవండి: బంజారాహిల్స్లో రూ. 350కు గజమా?


