అఖిలపక్షం ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు
ఖమ్మం: ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద శనివారం అఖిలపక్షం ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో నేటి నుంచి మే 12 వ తేదీ వరకు 144 సెక్షన్ విధించారు. మార్కెట్ యార్డులోని రాజకీయ నాయకులు రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలీసులను ఆదేశించారు. దీంతో మిర్చియార్డ్ చుట్టూ పోలీసుల వలయాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మంకు వచ్చే అన్ని రహదారులపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఖమ్మం మార్కెట్ కు వెళ్తున్న కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోలి.మధుసూదనారెడ్డిని శనివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళుతుండగా పోలీసులు ఆయనను కూసుమంచి మండల కేంద్రం వద్ద అడ్డుకున్నారు. మిర్చి మార్కెట్ను సందర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డిని సైతం అనుమతి లేదని పోలీసులు తిప్పి పంపారు.