గుడుంబాపై ఉక్కుపాదం | Heavy hand on gudumba | Sakshi
Sakshi News home page

గుడుంబాపై ఉక్కుపాదం

Jul 3 2015 12:56 AM | Updated on Sep 3 2017 4:45 AM

జిల్లా ఎక్సైజ్ అధికారులు గుడుంబా వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నారు.

వ్యాపారులపై పీడీ యాక్ట్
నల్లబెల్లం, పటిక అమ్మితే శిక్షిస్తాం..
ఎక్సైజ్ అధికారుల హెచ్చరిక

 
వరంగల్‌క్రైం : జిల్లా ఎక్సైజ్ అధికారులు గుడుంబా వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అధికారులు వివిధ శాఖల సమన్వయంతో గ్రామాలు, తండాల్లో గుడుంబాపై అవగాహన సదస్సులు విస్తృ తంగా నిర్వహిస్తూనే.. మరోపక్క రాటుదేలిన గుడుంబా వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వేలాది లీటర్ల గుడుంబాను ధ్వంసం చేయడంతోపాటు నిత్యం దాడులు చేస్తూ గుడుంబా విక్రయదారులు, ముడిసరుకు సరఫరా చేసేవారిని అదుపులోకి తీసుకుంటున్నారు. పెద్దఎత్తున గుడుంబా విక్రయాలు, ముడిసరుకు అమ్మే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొట్టమొదటగా నర్సంపేటకు చెందిన గుడుంబా విక్రయదారుడు ముప్పిడి రమేశ్‌పై మహబూబాబాద్ ఈఎస్‌టీఎఫ్ పీడీ యూక్ట్ ప్రయోగించి సెంట్రల్ జైలుకు తరలించింది.

ముడిసరుకు రవాణాదారుడిపై పీడీ యాక్ట్
హన్మకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో విరివిగా నల్లబెల్లం, పటికను సరఫరా చేస్తున్న పరకాలకు చెందిన వ్యాపారి చిటికేశి సదాశివుడుపై తాజాగా పీడీ యాక్ట్ నమోదు చేశారు. గుడుంబా ముడిసరుకు సరఫరాకు చెందిన పలు కేసుల్లో సదాశివుడు ముద్దారుు. దీంతో తిరిగి అలాంటి నేరాలకు పాల్పడకుండా పీడీ యాక్ట్-1986 కింద నిర్బంధించడానికి కలెక్టర్ గత నెల 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ నర్సారెడ్డి ఆదేశాల మేరకు సదాశివుడిని అదుపులోకి తీసుకుని ఈనెల 1వ తేదీన వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. సదాశివుడిని హన్మకొండ ఎక్సైజ్ సీఐ గండ్ర దేవేందర్‌రావు, టాస్క్‌ఫోర్స్ సీఐ రామకృష్ణ, హన్మకొండ ఎస్సైలు బిక్షపతి, సుబ్బరాజు సిబ్బంది అరెస్టు చేశారు. అలాగే గుడుంబా కేంద్రాలకు నల్లబెల్లం, పటిక వంటి ముడి సరుకును రవాణా చేస్తే కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా సీఐ దేవేందర్‌రావు హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖకు సంబంధం ఉన్న పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వారిని పీడీ యాక్ట్ ద్వారా నిర్బంధిస్తామని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement