సెల్‌చల్ హైటెక్ హరీష్! | harishrao using hi-tech technology for election campaigns | Sakshi
Sakshi News home page

సెల్‌చల్ హైటెక్ హరీష్!

Mar 14 2014 1:12 PM | Updated on Aug 14 2018 4:32 PM

సెల్‌చల్  హైటెక్ హరీష్! - Sakshi

సెల్‌చల్ హైటెక్ హరీష్!

రాజకీయ నాయకులు ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వినూత్న హైటెక్ విధానాన్ని ఎంచుకుంటున్నారు.

 సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: రాజకీయ నాయకులు ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వినూత్న హైటెక్ విధానాన్ని ఎంచుకుంటున్నారు. వాల్‌ పెయింటింగ్స్, పోస్టర్లు, ఫ్లెక్సీలు, సమావేశాలు ప్రచార సాధనాలుగా ఇంతవరకు ఉపయోగపడిన విషయం విదితమే. కాలం మారింది ఇంటికొక్క వాహనం ఉన్నా లేకున్నా ఇంట్లో ఉన్న వారందరికీ దాదాపుగా సెల్‌ఫోన్లుండటం అనివార్యంగా మారింది.

ఈ విషయాన్ని గమనించిన టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు సెల్‌ఫోన్ల ద్వారా నియోజకవర్గ ప్రజలతో నేరుగా మాట్లాడటానికి, వారి సమస్యలు వినడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇది ఎన్నికలకే కాకుండా ఆ తర్వాత కూడా ఉపయోగపడే విధంగా ఈ నూతన విధానాన్ని రూపొందించుకుంటున్నారు.

 సెల్‌ఫోన్ నంబర్ల సేకరణ
 సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, మహిళ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు,
 యువజన సంఘాల ప్రతినిధులు, రైతులు, కవులు, కళాకారులు, రచయితలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, కుల సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులతో పాటు అన్ని వర్గాల ప్రజల సెల్‌ఫోన్ నంబర్లను సేకరించడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించారు. ఇందులో యూత్ వింగ్ ప్రతినిధులు సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల నుంచి ఇప్పటికే వేలాది సెల్‌ఫోన్ నంబర్లను సేకరించారు. వీటితో పాటు వారి పుట్టిన రోజు తేదీలు, మరిన్ని వివరాలను నమోదు చేస్తున్నారు.

 నెట్ వర్క్‌తో నేరుగా పలకరింపు..
 సేకరించిన సెల్‌ఫోన్ నంబర్ల ద్వారా హరీష్‌రావు నేరుగా వారి పేరుతో పలకరించే  విధంగా ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ప్రత్యేక రోజుల్లో శుభాకాంక్షలు ప్రకటిస్తారు. వివిధ సందర్భాలలో కేసీఆర్, హరీష్‌రావులు చేసిన ప్రసంగాలను వినే అవకాశం కూడా కల్పిస్తారు. అభివృద్ధి పనులను ప్రచారం చేయడంతో పాటు సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి టోల్‌ఫ్రీ నంబరును త్వరలో ప్రకటించబోతున్నారు.

ఏ ఊరికి ఎప్పుడు వస్తారో పార్టీ వర్గాల ద్వారా ప్రజలకు నేరుగా సమాచారం అందడానికి ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వాడుకుని ప్రజలతో నేరుగా సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే ఇంట్లో ప్రత్యేక కంప్యూటర్ సిస్టమ్‌లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని సాంకేతిక నిపుణులతో కలిసి ఈ నెట్‌వర్క్ పనిచేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement