60 ఏళ్లుగా చేయలేనిది.. ఆరేళ్లలో సాధించాం | Harish Rao Visits Sangareddy Starts Hospital At Kalher | Sakshi
Sakshi News home page

కల్హేర్‌లో ఆస్పత్రిని ప్రారంభించిన హరీశ్‌ రావు

Sep 30 2019 3:40 PM | Updated on Sep 30 2019 4:01 PM

Harish Rao Visits Sangareddy Starts Hospital At Kalher - Sakshi

సాక్షి, సంగారెడ్డి: 60 ఏళ్లుగా పరిపాలించిన నేతలు చేయలేని అభివృద్ధిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరు సంవత్సరాల్లో చేసి చూపెట్టిందన్నారు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా సోమవారం కల్హేరు మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రిని, నిజాంపేట్‌లో వెటర్నరీ ఆస్పత్రిని ప్రారంభించారు. పారిశుద్ధ్యంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీశ్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. వైద్యం కోసం ఇక మీదట ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. రూ. 6కోట్లతో ఆస్పత్రిని నిర్మించామన్నారు. రెండు రోజుల్లో అదనపు సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. రూ.25 కోట్లతో నల్లవాగు ప్రాజెక్ట్‌ ఆధునీకీకరణ పనులు చేపట్టామన్నారు.

రైతుబంధు పథకం ద్వారా వచ్చే పైసలు చాలా మందికి అందలేదని.. 15 రోజుల్లో రైతులకు అందజేస్తామని హరీశ్‌ రావు తెలిపారు. సింగూరులో చుక్క నీరు లేదని ఎవ్వరు ఆందోళన పడవద్దని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ ద్వారా నీళ్లు నింపి సాగు, తాగు నీళ్లు అందజేస్తామన్నారు. నాందేడ్‌, అకొల జాతీయ రహదారిని రూ.2500 కోట్లతో నాలుగు లైన్‌ రోడ్డుగా మార్చుకోబోతుండటం గర్వకారణం అన్నారు హరీశ్‌ రావు.

Advertisement
 
Advertisement
Advertisement