ఎట్టకేలకు బీసీలకు రాయితీ! | GO No.165 was released | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు బీసీలకు రాయితీ!

Dec 29 2014 3:26 AM | Updated on Sep 2 2017 6:53 PM

గత ఆర్థిక సంవత్సరం (2013-14)లో ఎంపిక చేసిన బీసీ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పిస్తూ

ప్రగతినగర్ : గత ఆర్థిక సంవత్సరం (2013-14)లో ఎంపిక చేసిన బీసీ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పిస్తూ జీఓ నెం 165 ను విడుదల చేసింది. స్వయం ఉపాధి పథకం కింద ఎంపికైన 1890 మందికి, వృత్తి పనిదారుల సహకార సంఘాలకు రాయితీ నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల మార్చి వరకు లబ్ధిదారులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రాధ  ఆదేశించారు.

దీంతో జిల్లాలో ఎన్నో నెలలుగా రాయితీకోసం ఎదురుచూస్తున్న వెనుకబడిన తరగతుల వారికి మేలు జరుగనుంది. జిల్లాలో రాజీవ్ అభ్యుదయ యోజన కింద నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు, మూడు మున్సిపాలిటీలలో 248 మందికిగాను రూ. 6 కోట్ల 86 లక్షలు, 1608 మంది గ్రామీణులకు గాను రూ. 4కోట్ల 65 లక్షలు రాయితీ విడుదల అవుతుంది. 34 వృత్తి పనిదారుల సహకార సంఘాలకుగాను రూ. 6 కోట్ల 49 లక్షల 15 వేల రాయితీ వస్తుంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1890 మంది ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ద్వారా సబ్సిడీ పొందనున్నారు.

కాగా 2013 -14 ఆర్థిక సంవత్సరంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఈ జీఓలో తిరిగి మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. లబ్ధిదారులు తిరిగి తమ తమ బ్యాంకులకు వెళ్లి డ్యుయెల్ అకౌంట్‌ను (లోన్ అకౌంట్,జీరో బ్యాలెన్స్ అకౌంట్)సంబందిత శాఖలో అప్పగించాల్సిఉంటుంది. అనంతరం ఈ శాఖాధికారులు ముఖ్య కార్యాదర్శి ఆదేశాల మేరకు లబ్ధిదారుల జాబితా, వివరాలను తిరిగి కొత్త డ్యుయెల్ నెంబర్‌తో కలిపి జిల్లా కలెక్టర్ ఆమోదం పొందాల్సి ఉంటుంది.
 
పోరాట ఫలితంగానే  :
నరాల సుధాకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జనాభాలో 56 శాతంపైగా ఉన్నా బీసీల పొరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయితీని విడుదల చేసింది. ఉమ్మడి రాష్టంలో అయితే ఇది సాధ్యమయ్యేది కాదు.
 
ప్రభుత్వంపై నమ్మకముంది  : పొదిల శోభ, బీసీ మహిళ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు
తెలంగాణ ప్రభుత్వంపై మాకు పూర్తిగా నమ్మకముంది. రాయితీ విడుదలలో జాప్యం వల్ల వేల మంది వెనుకబడిన తరగతులకు చెందిన లబ్ధిదారులకు తిప్పలు తప్పలేదు. ఏది ఏమైన్పటికీ ప్రభుత్వం తీసుకున్నా నిర్ణయానికి బీసీల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే 2014-15 సంవత్సరంలో బీసీ లబ్ధిదారుల సంఖ్య , రాయితీ పెంచాలి. వెనుకబడిన తరగతుల ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం కృషి చేయాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement