
మాట్లాడుతున్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో నిరుపేదల ఆకలి తీర్చడానికి జీహెచ్ఎంసీ వినూత్న ప్రణాళికను రూపొందించింది. సిటీలో ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపు నిండా భోజనం పెట్టడానికి ‘ఫీడ్ ద నీడ్’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల14వ తేదీన ప్రారంభించనున్నట్టు దానకిశోర్ తెలిపారు. ఫీడ్ ద నీడ్ కార్యక్రమంపై నగరంలోని హోటల్ యజమానులతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ 14 ఫిబ్రవరి అనగానే లవర్స్ డేగా ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరిచే రోజుగా భావిస్తారని, అయితే ఇదే రోజున నగరంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండవద్దనే భావనతో ‘నీడ్ ద ఫీడ్’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చూట్టామని పేర్కొన్నారు.
ఆకలితో బాధపడుతున్న పేదప్రజల పట్ల నగర ప్రజలు ప్రేమ చూపించాలని, ఎవరైన తిండిలేక అలమటిస్తుంటే.. వారికి ఆహారం అందించి ఆదుకోవాలని హోటల్ యజమానులు, స్వచ్ఛంద సంస్థలకు కమిషనర్ పిలుపునిచ్చారు. పట్టణాలు, నగరాల్లో ఆహార పదార్థాల వృథా చాలా ఎక్కువగా ఉం టుందని, ఆకలికి మించిన ఆహారం కొందరికి అందుబాటులో ఉంటే.. ఆకలి తీర్చుకోవడానికి కొందరికి అవకాశం ఉండదన్నారు. తాము తినగా మిగిలిపోయిన ఆహారాన్ని చెత్తలో పడవేస్తుంటారు చాలామంది. దాంతో గ్రేటర్ పరిధిలో ఉత్ప త్తి అవుతున్న చెత్తలో 15 శాతం వరకు ఆహార పదార్థాలు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయన్నా రు. ఇంత భారీ స్థాయిలో ఆహారం వృథా కాకుం డా దానిని ఇతరులకు అందించడం ద్వారా ఆహారాన్ని సద్వినియోగం చేయడంతో పాటు ఆకలితో పస్తులుండే వారి కడుపు నింపవచ్చనే ఆలోచనల్లోంచి ఫీడ్ ద నీడ్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు కమిషనర్ దానకిశోర్ వివరించారు.
నగరవాసుల సంక్షేమానికి బల్దియా పెద్దపీఠ: మేయర్
జీహెచ్ఎంసీ చేపడుతున్న ఫీడ్ ద నీడ్ అనే కార్యక్రమానికి హోటల్స్ యజమానులు సహాకరించాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే 150 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా 40 వేల మందికిపైగా కేవలం 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని తెలిపారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దఎత్తున చర్యలు చేపడుతూనే సంక్షేమానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.
♦ ప్రతి ఒక్కహోటల్ యజమాని ఫుడ్ వేస్ట్గా పడేయకుండా.. ఫీడ్ ద నీడ్కు అందించాలన్నారు. ఇప్పటికే నగరంలో శిల్పారామం, జూబ్లీ చెక్ పోస్ట్ సర్కిల్ వద్ద ఆహార పదార్థాలను నిల్వవుంచడానికి రిఫ్రిజిరేటర్స్ను ఏర్పాటు చేశామని, ఎన్జీవోల సహకారంతో రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా నీడ్ ద ఫీడ్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ను రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇ.పి.టి.ఆర్.ఐ ఎండీ కల్యాణ్ చక్రవర్తి, జోనల్ కమిషనర్లు హరిచందన, శ్రీనివాస్రెడ్డి, శంకరయ్యలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.