మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. కేసీఆర్‌ సంతాపం | Former MLA Kaveti Sammaiah Passed Away KCR Condolences | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. కేసీఆర్‌ సంతాపం

Apr 9 2020 1:45 PM | Updated on Apr 9 2020 2:37 PM

Former MLA Kaveti Sammaiah Passed Away KCR Condolences - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌ : సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య గురువారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం స్వగృహంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.  తెలంగాణ ఉద్యమనాయకుడైన కావేటి సమ్మయ్య 2009, 2010లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరుపున రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

2014లో జరిగిన ఎన్నికల్లో బీఎస్సీ అభ్యర్థి కోనేరు కోనప్ప చేతిలో ఓటమిపాలయ్యారు. 2018లో తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. సమ్మయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల ఆయన కుటుంబీకులు, నియోజకవర్గ ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. 

సీఎం కేసీఆర్‌ సంతాపం 
మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.  ఈ సందర్భంగా పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపుతూ ఈ విషాద సమయంలో గుండెనిబ్బరంతో ఉండాలన్నారు. కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, పార్టీ నేతలు సంతాపం తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement