ఇంకా దొరకని చిరుత.. కొనసాగుతున్న ఆపరేషన్‌

Forest Officials Search Operation For Leopard In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగర్‌ శివారు మైలార్‌దేవ్‌పల్లి-కాటేదాన్‌ ప్రధాన రహదారి(ఎన్‌హెచ్‌ 7) హైవే రోడ్డు పక్కన గురువారం గాయాలతో కనిపించిన చిరుత ఆచూకి ఇంకా చిక్కలేదు. నిన్న మధ్యాహ్నం నుంచి అధికారులు శ్రమిస్తున్నా చిరుత ఆచూకీ లభించలేదు. సమీపంలోని రైల్వే స్టేషన్ పక్కన చెట్లు ఎక్కువగా ఉండడంతో అక్కడే ఉంటుందని భావిస్తున్నారు. కల్వకుర్తి పరిసర ప్రాంతాల్లో తప్పించుకున్న చిరుత ఇదే అయి ఉంటుందని, శంషాబాద్ అటవీ ప్రాంతం మీదుగా వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చిరుత ఇంకా దొరక్కపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

అయితే ఇళ్ళలో నుంచి ఎవ్వరూ బయటకు రావొద్దని అధికారులు స్థానికులను హెచ్చరించారు. డ్రోన్ కెమెరాల సాయంతో ఆ ప్రాంతమంతటా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.  ​కాగా చిరుతపులికి సంబంధించిన అడుగులను అధికారులు గుర్తించారు. కాగా అడుగుల ఆధారంగా చిరుత ఫాంహౌస్ లోనే ఉన్నట్లు తెలుస్తుంది. చిరుతను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన నైట్‌ విజన్‌ కెమెరాలతో పాటు ట్రాప్ కెమెరాల ఫీడ్ ఆధారంగా అధికారులు చిరుత ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. చిరుతను బంధించేందుకు రెండు బోన్లతో పాటు ప్రత్యేక వలల ఏర్పాటు చేశారు. దీంతో పాటు అటవీశాఖకు చెందిన షూటర్లను కూడా సిద్ధంగా ఉంచారు. ఎలాగైనా సరే చిరుతను పట్టుకొని తీరుతామని అధికారులు వెల్లడించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

(లారీ డ్రైవర్‌ అత్యుత్సాహం; చిరుత దాడి)
(చిరుత కలకలం : రంగంలోకి కుక్కలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top