మండలంలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా రైతుల పంటలతో పాటు తీవ్రంగా ఆస్తి నష్టం సంభవించింది.
ఖానాపూర్, న్యూస్లైన్ : మండలంలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా రైతుల పంటలతో పాటు తీవ్రంగా ఆస్తి నష్టం సంభవించింది. పస్పుల పంచాయతీ పరిధిలోని పుల్గంపాండ్రి, అర్చన్తండా, కొలాంగూడ, నాయకప్గూడ, పస్పుల, తులసీపేట తండా తదితర గ్రామాల్లో వర్షం నష్టం ఎక్కువగా జరిగింది. సుమారు 50 వరకు ఇళ్లు, 50 వరకు విద్యుత్ స్తంభాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పుల్గం పాండ్రి గ్రామానికి చెందిన పలువురికి గాయాలయ్యాయి.
గ్రామంలోని పుల్గం పాండ్రి గ్రామంలోని ధన్సింగ్, రమేష్, బలిరాం, రాజేశ్వర్, కనిరాం, కోక్య, సతీశ్, సురేశ్, గణేశ్, చందర్, జవహార్లాల్, సుభాష్, కోకియా, దూదిరాం, గణేష్ తదితరలకు చెందిన నివాసాలతో పాటు పశువుల పాకలు ధ్వంసమయ్యాయి. వీటితో పాటు నివాసాల్లో ఉన్న పసుపు, వరి ధాన్యం, బియ్యం, తదితర నివాస సామగ్రికి భారీగా నష్టం వాటిల్లింది. వీటితో పాటు గ్రామంలోని సింగిల్ ఫేస్ విద్యుత్ లైన్తో పాటు వ్యవసాయ మోటార్లకు అందే విద్యుత్ లైన్లకు సంబంధించిన స్తంభాలు 50 వరకు పూర్తిగా ధ్వంసమై నేలకొరిగాయి. కాగా సంబంధిత అధికారులు యుద్ధప్రతిపాదికన సర్వే చేసి తమకు నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.