
కామారెడ్డి నుంచి సేపూరి వేణుగోపాలచారి : వ్యవసాయ రంగానికి వెన్నెముక అయిన సహకార రంగానికి ఇక గడ్డు పరిస్థితులు తప్పేట్టు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతు సమన్వయ సమితులు సహకార రంగానికి సవాల్గా నిలువనున్నాయి. భూముల వివరాలతోపాటు పంట సాగుకు ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇవ్వడం, రైతులకు విత్తనాలు, ఎరువులు సమకూర్చడం నుంచి పంట కొనుగోలు దాకా సర్వాధికారాలు ఇకపై రైతు సమన్వయ సమితులకు దక్కనున్నాయని ప్రభుత్వ ప్రకటనలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. రాష్ట్రంలో 906 సహకార సంఘాలతోపాటు ఉమ్మడి జిల్లా యూనిట్గా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఉన్నాయి. అన్ని జిల్లాల సహకార బ్యాంకుల సమ్మిళితంగా రాష్ట్ర సహకార బ్యాంకు (టెస్కాబ్) పని చేస్తోంది. ఆయా సహకార సంఘాల్లో 20 లక్షల మంది రైతులు ఉన్నారు.
రాష్ట్రంలో డీసీసీబీల వారీగా ఉన్న సహకార సంఘాలు
సహకార సంఘాల్లోని రైతులు డైరెక్టర్లను, డైరెక్టర్లంతా కలిసి చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. జిల్లాలోని ఆయా సంఘాల మెజారిటీ చైర్మన్లు కలిసి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్, వైస్ చైర్మన్లతోపాటు అనుబంధంగా జిల్లా సహకార మార్కెటింగ్ చైర్మన్, వైస్ చైర్మన్లనూ ఎన్నుకుంటారు. ఆయా జిల్లాల చైర్మన్లు కలిసి రాష్ట్ర చైర్మన్ను ఎన్నుకోవడం సహకార రంగంలోని విధానం. పార్టీలతో సంబంధం లేకుండా సహకార సంఘాల ఎన్నికలు జరుగుతాయి. దశాబ్దాలుగా రైతులకు సహకార సంఘాల ద్వారా ఎన్నో సేవలు అందుతున్నాయి.
రైతు సమన్వయ సమితులతో ముప్పు..
ప్రభుత్వం కొత్తగా తెరపైకి తీసుకొచ్చిన రైతు సమన్వయ సమితులు ఇప్పుడు సహకార రంగానికి ముప్పు తెస్తాయని భావిస్తున్నారు. గ్రామస్థాయిలో గ్రామ సమన్వయ సమితి, మండలస్థాయిలో మండల సమన్వయ సమితి, జిల్లాస్థాయిలో జిల్లా సమన్వయ సమితిని ఏర్పాటు చేస్తారు. భూముల రికార్డుల నుంచి మొదలుకుని అన్ని విషయాలను రైతు సమన్వయ కమిటీలే చూసుకుంటాయని ప్రభుత్వం చెబుతుండడంతో సహకార సంఘాల ఉనికి ప్రశ్నార్థకం కానుందనే అనుమానం వస్తోంది.
సహకార సంఘాల పరిస్థితి
రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తుండడం మూలంగా అసలు సహకార సంఘాలు ఉంటాయా? ఉండవా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఎన్నికల దిశగా ఆలోచన చేయడంలేదని తెలుస్తోంది.
నాలుగు నెలల్లోముగియనున్న ‘విండో’ల పదవీకాలం
రాష్ట్రంలో సహకార సంఘాలకు 2013లో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఎన్నికలు జరిగాయి. వాటితోపాటు జిల్లా సహకార, మార్కెటింగ్ సంస్థల పదవీకాలం వచ్చే ఏడాది మొదట్లో ముగియనుంది. అంటే మరో 4 నెలలే సంఘాల పాలకవర్గాలు పదవుల్లో కొనసాగుతాయి. అయితే ఏ వ్యవస్థలోనైనా ఎన్నికలు నిర్వహించాలంటే పదవీకాలం ముగిసేకన్నా ఆరు నెలల ముందే ప్రక్రియ మొదలు పెడతారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించి దృష్టి సారించలేదు.
పంట రుణాలు, స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు కూడా సహకార సంఘాల ద్వారానే ఇస్తారు. విత్త నాలు, ఎరువులు సహకార సంఘాల ద్వారానే పంపిణీ అవుతున్నాయి. గత దశాబ్ద కాలంగా చాలా వరకు పండిన ధాన్యం కూడా సహకార సంఘాల ద్వారానే కొనుగోలు చేయడం జరుగుతోంది.