నకిలీ మందులు విక్రయ ముఠాకు జైలు | Fake drugs are sold to individuals sentenced to prison | Sakshi
Sakshi News home page

నకిలీ మందులు విక్రయ ముఠాకు జైలు

Jul 25 2015 3:55 AM | Updated on May 25 2018 2:38 PM

నకిలీ మందులు విక్రయించిన వ్యక్తులకు జైలు శిక్ష, జరిమానాలు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు

 నిజామాబాద్ లీగల్ : నకిలీ మందులు విక్రయించిన వ్యక్తులకు జైలు శిక్ష, జరిమానాలు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని గుర్బాబాది రోడ్డులో గల ఓం శ్రీ కాలభైరవ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, నిజామాబాద్ మండలం బోర్గాం(పీ) గ్రామంలోని అను మెడికల్ స్టోర్‌‌సలో 2009 ఫిబ్రవరి 10న డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఫ్లోసిన్ అనే ట్యాబ్లెట్ శాంపిల్ తీశారు. దీనిని హైదరాబాద్‌లోని ప్రభుత్వ ల్యాబొరేటర్‌కు పరిశీలన నిమిత్తం పంపారు. ట్యాబ్‌లెట్‌లో ఓఫెక్సెస్ 200 ఎంజీ నిల్‌గా ఉందని నివేదిక వచ్చింది. దీనిని వింకో ఫార్మా, భరత్ ల్యాబొరేటర్స్ కంపెనీలు ఉత్పత్తి చేసినట్లుగా గుర్తించారు.

పై రెండు కంపెనీలు ప్రస్తుతం మూతపడ్డాయి. ఈ మేరకు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నకిలీ మందులు విక్రయిస్తున్న ఓం శ్రీ కాలభైరవ, అను మెడికల్ స్టోర్‌‌సపై కేసు నమోదు చేశారు. ఈ కేసు ట్రయల్ నడిచి శుక్రవారం బెంచ్‌పైకి వచ్చింది. కేసు పూర్వపరాలను మొదటి అదనపు జిల్లా జడ్జి కిరణ్‌కుమార్ పరిశీలించారు. నకిలీ మందులు విక్రయిస్తున్న వి.శ్రీనివాస్, ఫార్మసిస్టు మంజుల, రాజేష్, అనురాధకు సంవత్సరం కఠిన కారగార శిక్ష, రూ. 10 వేల చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో రెండు నెలల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు. డ్రగ్ శాఖ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామకృష్ణ వాదించారని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement