‘ఔటర్‌’పై అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు: కేటీఆర్‌ | Sakshi
Sakshi News home page

‘ఔటర్‌’పై అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు: కేటీఆర్‌

Published Tue, Nov 28 2017 12:48 AM

Facilities with international standards on 'Outer': KTR - Sakshi

హైదరాబాద్‌: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఔటర్‌ రింగ్‌రోడ్డును తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. సోమవారం ఆయన నానక్‌రాంగూడ సమీపంలోని పుప్పాలగూడ టోల్‌గేట్‌ వద్ద రేడియో ఫ్రీక్వెన్సీ ఐడింటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) టోల్‌ వసూలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా ఆధునిక పద్ధతిలో టోల్‌ వసూలు కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఔటర్‌రింగ్‌రోడ్డుతో పాటు సర్వీసు రోడ్డుపై గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వరకు రూ.30 కోట్లతో ఎల్‌ఈడీ, హైమాస్ట్‌ లైట్లను ఏర్పాటు చేశామని చెప్పారు.

రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ నగరం చుట్టూ ఉన్న ఔటర్‌రింగ్‌ రోడ్డంతా 159 కిలో మీటర్ల దూరం వరకు రూ.120 కోట్లతో ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఔటర్‌రింగ్‌రోడ్డుపై రాబోయే రోజుల్లో ప్రతి 13 కిలోమీ టర్లకు ఒకటి చొప్పున అంబులెన్స్‌లను ఏర్పాటు చేయడంతో పాటు మరింత పచ్చదనాన్ని పెంచి నందనవనంగా తీర్చిదిద్దుతామన్నారు. హెచ్‌ఎం డీఏ కమిషనర్‌ చిరంజీవులు మాట్లాడుతూ ఆర్‌ఎఫ్‌ఐడీ పద్ధతిలో టోల్‌ వసూలుకు కార్లకు కనిష్ట డిపాజిట్‌ బ్యాలెన్స్‌గా రూ.200, మినీ బస్‌లకు రూ.300, బస్‌లకు రూ.400, భారీ వాహనాలకు రూ.500గా నిర్ణయించామన్నారు. రాబోయే రోజుల్లో బ్యాంక్‌ అకౌంట్ల నుంచి, ఆన్‌లైన్‌ ద్వారా తీసుకునే పద్ధతిని అందుబాటులోకి తెస్తామన్నారు. వాహనాలపై అంటించే స్టిక్కర్‌తో వాహనం దానంతట అదే గేటు తెరచుకోవటంతో వాహనం వెళ్లిపోతుందన్నారు. 

Advertisement
Advertisement