ఏ జంతువు వేటకు బలి కావొద్దు.. | Electric strings in forest areas and hunting animals | Sakshi
Sakshi News home page

ఏ జంతువు వేటకు బలి కావొద్దు..

Feb 8 2019 1:02 AM | Updated on Feb 8 2019 1:02 AM

Electric strings in forest areas and hunting animals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అటవీప్రాంతాల్లో విద్యుత్‌ తీగలను అమర్చి జంతువులను వేటాడటం ఎక్కువవుతున్న నేపథ్యంలో దీనికి చెక్‌ పెట్టే దిశగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో అక్రమ విద్యుత్‌ సరఫరాను వెంటనే నిలిపేయాలని విద్యుత్‌ శాఖాధికారులను ఆదేశించింది. కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలో పోలీ సు, అటవీ, ఎక్సైజ్, విద్యుత్‌ శాఖాధికారులు ఉమ్మడి పరిశీలన చేసి, అక్కడి పరిస్థితులపై  నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలో అటవీ, జంతు సంరక్షణ, పోలీసు, ఎక్సైజ్, నార్కోటిక్‌ డ్రగ్స్‌ తదితర చట్టాలు  అమలవుతున్నాయా.. లేదా... అన్న విషయాన్ని పర్యవేక్షించే నిమిత్తం ఓ బృందాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలంది. ఈ ప్రాంతంలో ఏ జంతువు కూడా అక్రమ వేటకు బలి కాకుండా చూడాలని తేల్చి చెప్పింది.  

ఆ దిశగా ఆలోచించండి.. 
కవ్వాల్, ఆమ్రాబాద్‌ పులుల సంరక్షణ కేం ద్రాల్లో స్పెషల్‌ టైగర్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పా టు, ఆయుధాలు ఉపయోగించడంలో కేంద్రం తగిన సహకారాన్ని అందించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా శిక్షణ పొందిన ఫారెస్ట్‌ గార్డులు, ఇతర అటవీ సిబ్బంది ఆయుధాలను ఉపయోగించేందుకు అనుమతినిచ్చే విషయా న్ని హైకోర్టు పరిశీలించాలంది. ఈ వ్యాజ్యంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎక్సైజ్‌ కమిషనర్, టీఎస్‌ఎన్‌పీడీసీ ఎల్‌ చైర్మన్, ఎండీలను ప్రతివాదులుగా చేర్చింది. దీనిపై కేంద్ర అటవీ శాఖ, జాతీయ పులుల సంరక్షణ సంస్థ అభిప్రాయాలను రెండు వారా ల్లో తమ ముందుంచాలని అసిస్టెంట్‌ సొలి సిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ)ను ఆదేశించింది.  తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కవ్వాల్‌ కేంద్రంలో పులుల సంరక్షణ పథకాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన జాగిర్‌ దియా సుర్‌ పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

విద్యుత్‌లైన్లకు ఇన్సులేషన్‌ మేలు..
ధర్మాసనం గత ఆదేశాల మేరకు.. ఈ కేసులో సహకరించేందుకు అటవీ శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్సర్వేటర్‌ ప్రశాంత్‌కుమార్‌ ఝా, కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రం ఫీల్డ్‌ డైరెక్టర్‌ సి.శరవణన్‌  కోర్టు ముందు హాజరయ్యారు. జంతువుల అక్రమ వేటకు విద్యుత్‌ తీగలను ఉపయోగిస్తున్న నేపథ్యంలో దీనికి చెక్‌ పెట్టే విషయంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. విద్యుత్‌ సరఫరా లైన్లకు ఇన్సులేషన్‌ చేయడం వల్ల ఫలితం ఉంటుందని అటవీ శాఖాధికారులు సూచించగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ శాఖా ధికారులను కోర్టు ఆదేశించింది. కవ్వాల్‌ పులుల సంరక్షణ విషయంలో జాతీయ పులుల సంరక్షణ సంస్థ ఇప్పటికే తగిన సహాయ, సహకారాలు అందిస్తోందని ఏఎస్‌జీ కె.లక్ష్మణ్‌ చెప్పారు. డ్రోన్ల సాయం తో జంతువుల వేటను అడ్డుకోవచ్చని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి కోర్టుకు చెప్పారు. కవ్వాల్, ఇతర వ్యవహారాలను ఫీల్డ్‌ డైరెక్టర్‌ పరిధిలోకి తీసుకు రావాలని  కోర్టు స్పష్టం చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement