ప్రజాభాగస్వామ్యంతోనే అభివృద్ధి
కేంద్ర మంత్రి రమేశ్
పట్టణాలు, నగరాల అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ
‘ఐడియాస్ కాన్క్లేవ్ ఫర్ బెటర్ హైదరాబాద్లో’ ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: జనాభా నియంత్రణతోనే ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర తాగునీరు, పారిశుధ్య నిర్వహణ శాఖ సహాయ మంత్రి రమేశ్ జిగజినాగి అన్నారు. ప్రభుత్వంతో ప్రజలు కలిసిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నగరాలు, పట్టణాలలో సమస్యల పరిష్కారం కోసం ప్రజల పాత్ర ఎక్కువగా ఉండాలని అన్నారు. ‘సబ్కా సాత్– సబ్కా వికాస్’నినాదంతో పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ‘ఐడియాస్ కాన్క్లేవ్ ఫర్ బెటర్ హైదరాబాద్’అనే అంశంపై అవేర్నెస్ ఇన్ యాక్షన్ సంస్థ నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సును కేంద్ర మంత్రి రమేశ్ శనివారం హైదరాబాద్లోని సెస్ ఆడిటోరియంలో ప్రారంభించారు.
పట్టణ రవాణా, గృహ నిర్మాణం, రహదారులు, పట్టణ ప్రణాళిక, నాణ్యమైన విద్య, నిరంతర కరెంటు సరఫరా, మెరుగైన మురుగునీటి పారుదల వ్యవస్థ, బస్తీల అభివృద్ధి, ఊపాధితో కూడిన పారిశ్రామిక అభివృద్ధి, శాంతి భద్రతలు, ఆరోగ్యం–పోషకాహారం, పరిశభ్రమైన తాగునీరు, సుపరిపాలన, డిజిటలైజేషన్ వంటి అంశాలు హైదరాబాద్ అభి వృద్ధిలో కీలకంగా ఉంటాయని అన్నారు. ఈ రంగా ల్లో అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలి పారు. కాగా, దేశవ్యాప్తంగా 83,677 కిలో మీటర్ల రహదారులను నిర్మిస్తున్నట్టు మంత్రి చెప్పారు. 2022 వరకు ఈ కార్యక్రమాన్ని ముగించేందుకు ప్రతీరోజు సగటున 30 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.458.12 కోట్లు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బి.వి.పాపారావు, అవేర్నెస్ ఇన్ యాక్షన్ ప్రతినిధులు దినేశ్కుమార్, ఎ.సతీశ్కుమార్, ఎం.మాధవి, టి.వి.బుచ్చి బాబు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం..
మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమని, ప్రధాని నరేంద్ర మోదీ తరచూ ఈ పథకం గురించి తమ దగ్గర ప్రస్తావిస్తుంటారని కేంద్ర మం త్రి రమేశ్ జిగజినాగి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఏకకాలంలో తాగునీరు అందించడం దేశంలో ఇంతవరకు ఎక్కడా జరగలేదని చెప్పారు. శనివారం హైదరాబాద్లో తాగునీరు, పారిశుధ్య పథకాలపై మంత్రి సమీక్ష జరిపారు. రాష్ట్రంలో జరుగుతున్న ‘భగీరథ’పనులను చూడాలనుకుంటున్నానని, పార్లమెంటు సమావేశాల తర్వాత కచ్చితంగా వస్తానని చెప్పారు.