పల్లెని వదిలి పట్నంలో ఉంటున్న సర్పంచ్‌

Coronavirus: Jakkapur Villagers Fires On Their Sarpanch In Kamareddy - Sakshi

సాక్షి, నిజాంసాగర్‌ (జుక్కల్‌): కొత్తగా ఏర్పాటైన జీపీ అభివృద్ధి కోసం ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచ్‌ జాడ లేకపోవడంతో శనివారం గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. పల్లెని వదిలి పట్నంలో ఉంటున్న సర్పంచ్‌ బంజ కంశవ్వ మాకు వద్దు అంటూ నిజాంసాగర్‌ మండలం జక్కాపూర్‌లో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. మల్లూర్‌ జీపీ పరిధిలో ఉన్న జక్కాపూర్‌ గ్రామం ఏడాదిన్నర కిందట నూతన జీపీగా ఏర్పాటైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో సర్పంచ్‌ హైదారబాద్‌కు పరిమితం అయ్యారని గ్రామస్తులు పేర్కొన్నారు. సర్పంచ్‌పై చర్యల కోసం మండల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించాలని తీర్మానం చేశామని తెలిపారు.

సర్పంచ్‌ లేక పాలన అస్తవ్యస్తం 
మద్నూర్‌(జుక్కల్‌): మండలంలోని సోమూర్‌ సర్పంచ్‌ గంగుబాయి స్థానికంగా లేకపోవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మార్చి 19న ఆమె అమెరికాలో బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే చిక్కుకున్నట్లు తెలిసింది. సర్పంచ్‌ విదేశాలకు వెళ్తున్నట్లు సమాచారం కూడా అందించలేదని ఎంపీవో ఆర్‌వీఎస్‌ఎన్‌ రెడ్డి శనివారం తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top