కాలేజీల్లో వసతులకు నిధులు | college facilities funding | Sakshi
Sakshi News home page

కాలేజీల్లో వసతులకు నిధులు

Apr 9 2015 12:26 AM | Updated on Apr 3 2019 8:07 PM

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పక్కా సదుపాయాలు కల్పించేం దుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పక్కా సదుపాయాలు కల్పించేం దుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మౌలిక సదుపాయాలు లేక, సరిపడా తరగతి గదులులేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పరిస్థితులను చక్కదిద్దాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 465 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉంటే.. మొదట265 కాలేజీల్లో వసతుల కల్పనకు చర్యలు చేపట్టింది. ఇందులో 9 జిల్లాల్లోని 177 కాలేజీల్లో మరుగుదొడ్లు, నీటి శుద్ధి కేంద్రాలు, 69 కాలేజీల్లో అదనపు తరగతి గదులు, 19 కాలేజీల్లో ప్రహరీగోడలు, ఇతర సదుపాయాలను కల్పించనుంది.

ఈ మేరకు రూ. 82.25 కోట్లతో ఈ కాలేజీల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం నిధులు మం జూరు చేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశా రు. నాబార్డు ఆర్థిక సహకారంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మంచి రోజులు వచ్చినట్లేనని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. అలాగే ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారిస్తే విద్యారంగం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement