మూతపడిన ‘పురావస్తు’ | Closed 'archaeological' | Sakshi
Sakshi News home page

మూతపడిన ‘పురావస్తు’

Jul 23 2014 3:11 AM | Updated on Oct 17 2018 6:06 PM

జిల్లా కేంద్రంలోని తిలక్‌గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పురావస్తు ప్రదర్శన శాల దాదాపు ఏడాదికాలంగా అలంకారప్రాయంగా మారింది.

నిజామాబాద్ కల్చరల్ : జిల్లా కేంద్రంలోని తిలక్‌గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పురావస్తు  ప్రదర్శన శాల దాదాపు ఏడాదికాలంగా అలంకారప్రాయంగా మారింది. 2004 లో అప్పటి ప్రభుత్వం జిల్లా ప్రజల కోసం రాతికాలంలో వాడిన పింగాణి పాత్రలు, నవాబుల డాబును తెలిపే కత్తులు,తల్వార్‌లు, క్రీస్తు పూర్వం నాటి అద్భుతమైన శిల్పసంపద తదితర వాటిని ఈ ప్రదర్శన శాలలో ఉంచారు.

16 వ శతాబ్దం మొదలుకొని ఆ తర్వాత పరిపాలన చేసిన పాలకులు వినియోగించిన అలనాటి  వస్తువులను,  చారిత్రక సంపదను, కాకతీయుల శిల్పాల కళ లను, ఛాయచిత్రాలను ఈ ప్రదర్శనశాలలో  పెట్టారు. పురాతన సంపద,కళావైభవాన్ని తెలిపేందుకు ప్రజలకు ఉచితంగా తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన శాల 2005 నుంచి 2013 మే కాలం వరకు ఉచితంగా చూసే భాగ్యాన్ని కోల్పోయారు.  

 ప్రవేశ రుసుము అమలు
 ఈ పురావస్తు ప్రదర్శన శాలను తిలక్‌గార్డెన్‌లో ఏర్పాటు చేశారు. అయితే తిలక్‌గార్డెన్‌లోకి ప్రవేశించాలంటే  * 5 ప్రవేశరుసుము విధించారు. దీంతో ప్రతిరోజు వందల సంఖ్యలో వచ్చే ప్రజలు రోజురోజుకు తగ్గిపోవడం జరిగింది. గత ఏడాది వర్షాకాలం కంటే ముందు వరకు నామమాత్రంగా నడిచిన ఈ ప్రదర్శనశాల ప్రస్తుతం అలంకారప్రాయంగా మారిపోయింది. గత వర్షకాలంలో భారీ వర్షాలు కురవడంతో పురావవస్తు ప్రదర్శన శాల భవనం పెచ్చులూడిపోయి ఎక్కడ కూలుతుందోనని అప్పటి నుంచి  మూసివే శారు.

 శిథిలావస్థకు చేరిన భవనానికి మరమ్మతుల కోసం అప్పట్లోనే 25 లక్షల రూపాయల వరకు ఆ శాఖ మంజూరు చేసింది. వర్షాకాలం పూర్తవగానే మరమ్మతులు చేస్తామని ఆ శాఖ అధికారులు కూడా ప్రకటించారు.  ఇప్పటి వరకు పురావస్తు ప్రదర్శన శాల భవనానికి ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు.  దీంతో పురావస్తు ప్రదర్శన ప్రధాన ద్వారానికి తాళం వేసి ఉంచారు. ఒక ఉద్యోగిని ఇన్‌చార్జిగా నియమించినప్పటికీ సదరు ఉద్యోగి మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ విషయమై  సదరు ఇన్‌చార్జి ఉద్యోగిని ‘సాక్షి’ సంప్రదించగా  తాను బిజీగా ఉన్నానని సమాధానం చెప్పడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement