తాత్కాలిక సర్దుబాటే! | Central govt says about krishna water to AP and Telangana govts | Sakshi
Sakshi News home page

తాత్కాలిక సర్దుబాటే!

Apr 1 2018 1:27 AM | Updated on Sep 2 2018 5:20 PM

Central govt says about krishna water to AP and Telangana govts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు వెలువడే వరకూ కృష్ణా జలాల్లో వాటాలను ఖరారు చేయలేమని తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తేల్చిచెప్పింది. 2015లో ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటే అప్పటివరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విధానం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున దక్కు తాయి. కృష్ణా నదీ జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీ రాష్ట్రాలకు పునఃపంపిణీ చేస్తూ రెండేళ్ల క్రితం బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

ఇరు రాష్ట్రాలు దాఖలు చేసిన వ్యాజ్యాలను విచారిస్తూనే ఉమ్మడి రాష్ట్రానికి కేటా యించిన జలాలను తెలంగాణ, ఏపీలకు పంపిణీ చేయడానికి బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ కేసులు విచారణలో ఉండటంతో 2015లో జూన్‌ 21, 22న ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశమైన కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున పంపిణీ చేస్తూ ‘తాత్కాలిక ఏర్పాటు’ చేశారు. అప్పట్లో దీనికి అంగీకరించిన రెండు రాష్ట్రాలు 2016లో వ్యతిరేకించడంతో తాత్కా లిక సర్దుబాటునే అమలు చేశారు. 2017లో మళ్లీ రెండు రాష్ట్రాలు దీనిని వ్యతిరేకించడంతో కృష్ణా జలాల్లో వాటాల లెక్కలు తేల్చాలని కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతానికి తాత్కాలిక సర్దుబాటు ప్రకారం కృష్ణా జలాలను వినియోగించుకోవాలని రెండు రాష్ట్రాలకు ఇటీవల కేంద్రం తేల్చిచెప్పిందని అధికారవర్గాలు వెల్లడించాయి.  

Advertisement
 
Advertisement
Advertisement