‘డ్రిప్’తో రైతులకు లాభదాయకం | beneficial to farmers with 'DRIP' | Sakshi
Sakshi News home page

‘డ్రిప్’తో రైతులకు లాభదాయకం

Jun 26 2014 12:16 AM | Updated on Aug 17 2018 2:18 PM

పంటల సాగులో డ్రిప్ విధానాన్ని అవలంబిస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందని జిల్లా ఉద్యాన శాఖ ప్రాజెక్ట్ డెరైక్టర్ బి.బాబు అన్నారు.

జిల్లా ఉద్యాన శాఖ ప్రాజెక్ట్ డెరైక్టర్ బాబు
నవాబుపేట: పంటల సాగులో డ్రిప్ విధానాన్ని అవలంబిస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందని జిల్లా ఉద్యాన శాఖ ప్రాజెక్ట్ డెరైక్టర్ బి.బాబు అన్నారు. బుధవారం మండలంలోని మమ్మదాన్‌పల్లిలో జిల్లా సూక్ష్మ నీటి పారుదల పథకం ఆధ్వర్యంలో రైతులకు యాసిడ్ ట్రీట్‌మెంటు, ఫెర్టిగేషన్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా నెట్‌ఫీం సంస్థవారు రైతులకు డ్రిప్ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పీడీ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల పరిధి వరకు కూరగాయల జోన్‌గా మార్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.

దీని ద్వారా దిగుబడి పెంచడమే కాకుండా రైతులకు దన్నుగా నిలవాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయలను అరికట్టి ఇక్కడి రైతులతో సాగు చేయించి వారి జీవన స్థాయిని పెంచాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. ఇందుకు తగిన విధివిధానాలను ఖరారు చేస్తున్నామన్నారు. కూరగాయల జోన్‌కు డ్రిప్ సహకారం చాలా అవసర మని ఆయన తెలిపారు.

జిల్లాలోని 78 వేల బోరుబావుల కింద ప్రస్తుతం 59 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయన్నారు. ఇందులో 24 వేల హెక్టార్లలో మాత్రమే రైతులు డ్రిప్‌తో సాగు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కూర గాయల సాగు దిశగా రైతులను చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.డ్రిప్‌తో సాగునీరు ఆదా కావడమే కాకుండా విద్యుత్ వాడకం తగ్గుతుందన్నారు.

దిగుబడి పెరుగుందని ఆయన తెలిపారు. ఇందుకోసం ప్రతి రైతూ డ్రిప్ విధానంలో సాగు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అదనపు ప్రాజెక్ట్ డెరైక్టర్ హరిప్రసాద్, ఎంఐడీసీవో బిచ్చయ్య, నెట్‌ఫీం సంస్థ డీసీవో బాలసుబ్రహ్మణ్యం, మైక్రో ఇరిగేషన్ ఇంజినీర్ శిరీష, మైక్రో ఇరిగేషన్ ఏరియా ఆఫీసర్లు రాజేందర్, లక్ష్మయ్య, రాంరెడ్డి, నర్సింలు, చంద్రకాంత్, సంధ్యాజ్యోతి, మౌనిక, కృష్ణ య్య, జ్యోతిర్లింగం, రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement