లంబాడీలపై దాడులు అమానుషం | Attacks on lambadis are inhuman | Sakshi
Sakshi News home page

లంబాడీలపై దాడులు అమానుషం

Nov 27 2017 3:08 AM | Updated on Nov 27 2017 3:08 AM

Attacks on lambadis are inhuman - Sakshi

హైదరాబాద్‌:  తెలంగాణలో లంబాడీ జాతిని ఎస్టీ జాబితా నుండి తొలగించాలని కోయలు, గోండ్లు నిరసన ప్రదర్శన చేయడమే కాకుండా లంబాడీ ఉపాధ్యాయులపై దాడులు చేయడం అమానుషం అని మాజీ ఎంపీ ధరావత్‌ రవీంద్రనాయక్‌ అన్నారు. ‘లంబాడీలపై దాడులు – కుట్రలు – వాస్తవాలు’అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం డాక్టర్‌ రాజ్‌కుమార్‌ జాదవ్‌ ఆధ్వర్యంలో లంబాడీ నాయకుల సమావేశం జరిగింది. లంబాడీలను దెబ్బతీయాలని కొన్నిశక్తులు దురుద్దేశంతో కోయలను ఉసిగొల్పుతున్నాయని రవీంద్రనాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాల్సిన పాలకులు వాటిని విస్మరించడమే కాకుండా అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో పాఠశాలల గదుల నుండి లంబాడీ ఉపాధ్యాయులను బయటకు తీసుకువచ్చి దాడులు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. బంజారా, కోయల మధ్య జరుగుతున్న గొడవలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ మాట్లాడుతూ లంబాడీ జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పిం చాలని కోరారు.

రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడంలేదని ఆరోపించారు. డాక్టర్‌ రాజ్‌కుమార్‌ జాదవ్‌ మాట్లాడుతూ ఈ నెల 30న భద్రాద్రి కొత్తగూడెంలో లంబాడీ ఆత్మగౌరవ భారీ బహిరంగసభను లక్ష మందితో నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బెల్లయ్య నాయక్, సంజీవ నాయక్, జగన్‌లాల్, లక్ష్మణ్‌ నాయ క్, బాలు చౌహన్, కరాటే రాజు, శ్యాం నాయక్, రాంచంద్రనాయక్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement