పోలీసులున్నదే ప్రజల కోసం..
సాక్షి, హైదరాబాద్: జీవితంలో ట్రాఫిక్ రూల్స్ ఓ భాగమని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. వీటిని గౌరవించి ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో బుధవారం రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. పోలీసులు ఉన్నదే ప్రజల కోసమన్నారు. మీ భద్రత మా బాధ్యతగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో బాధ్యతాయుత పౌరునిగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఈ బాధ్యత కొత్త జనరేషన్పై ఎక్కువగా ఉందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో యువత అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమానికి హాజరైన నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు అనుక్షణం కృషి చేస్తున్నారన్నారు. దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ఏటా అనేక మంది మృతి చెందుతున్నారన్నారు. ప్రమాదంలో యువత మృతి.. వారి కుటుంబాలకు తీరని లోటని పేర్కొన్నారు. నిన్న యూసఫ్గూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందారని, తప్పు ఎవరిదైనా ప్రాణం చాలా ముఖ్యమన్నారు. హెల్మెట్ దరించాలని, మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని కోరారు. ట్రాఫిక్ రూల్స్ పాటించి, పోలీసులకు సహకరించాలని యువతను కోరారు.
చదవండి: డెత్ స్పీడ్లో యూత్..