ఆ రెండు ఓట్లపై సందిగ్ధత

రాజ్యసభ ఎన్నికల్లో కోమటిరెడ్డి, సంపత్‌లు ఓటు వేసే అవకాశం ఉందా?

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ సభ్యత్వం రద్దయిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు.. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంపై సందిగ్ధం నెలకొంది. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 23న పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే నాటికి కోమటిరెడ్డి, సంపత్‌లు ఎమ్మెల్యేలుగా ఓటరు జాబితాలో ఉన్నారు.

ఇటీవల అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఈ ఇద్దరి ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేశారు. దీంతో వీరి విష యంలో ఏం చేయాలని రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నరసింహచార్యులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు లేఖ రాశారు. ఆయన దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కోరారు. సభ్యత్వ రద్దు వ్యవహారంపై కేసు కోర్టు విచారణలో ఉంది. కోర్టు నిర్ణయం తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top