రాజ్యసభ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ సీరియస్
ఒడిశాలో ముగ్గురు సభ్యులపై సస్పెన్షన్ వేటు
హరియాణాలోనూ కఠిన చర్యలుంటాయన్న అధిష్టానం
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఖాళీ అయిన 11 రాజ్యసభ స్థానాల కోసం జరిగిన ఎన్నికల్లో అధికార పక్షాలు గెలుపే లక్ష్యంగా తమ చట్టసభల సభ్యులను కొనేశాయని, క్రాస్–ఓటింగ్కు పాల్పడ్డాయని విపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. బేరసారాలు జరిగాయన్న ప్రాథమిక సమాచారంతో ఒడిశాలో ముగ్గురు సభ్యులపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటువేసింది. హరియాణాలోనూ కఠిన చర్యలు తప్పవని పార్టీ హెచ్చరించింది. రాజ్యసభలో 37 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా గతంలోనే 26 చోట్ల ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికయ్యారు. దాంతో మిగిలిన 11 స్థానాలకే బిహార్, ఒడిశా, హరియాణాల్లో ఎన్నికలు జరపగా తొమ్మిది చోట్ల ఎన్డీఏ అభ్యర్థులే విజయం సాధించారు. కాంగ్రెస్, బీజేడీ ఒక్కో స్థానంలో గెలుపొందాయి. మొత్తంగా చూస్తే 37 స్థానాలకుగాను ఎన్డీఏ కూటమి 22 చోట్ల విజయం సాధించింది.
రహస్య ఓటింగ్ విధానంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సోమవారం హరియాణాలో రెండు స్థానాలకు ఓట్ల లెక్కింపు సోమవారం ఆగిపోగా మంగళవారం ఆరంభించారు. బీజేపీ తరఫున సంజయ్ భాటియా, కాంగ్రెస్ తరఫున కరమ్వీర్ సింగ్ బౌధ్ విజయం సాధించారు. వాస్తవ మెజారిటీ ప్రకారం బౌధ్ గెలుపు నల్లేరుపై నడకే. కానీ క్రాస్ ఓటింగ్ కారణంగా అత్యంత స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. మా ఎమ్మెల్యేలందరికీ షోకాజ్ నోటీస్లు పంపబోతున్నామని హరియాణా కాంగ్రెస్ ఇన్చార్జ్ బీకే హరిప్రసాద్ తెలిపారు.
‘‘ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి సతీశ్ నందాల్ను ఎలాగైనా గెలిపించాలని ఎన్డీఏ కూటమి కుట్ర పన్నింది. అయినాసరే మా అభ్యర్థి బౌధ్ గెలిచారు. అగి్నపరీక్షలో కాంగ్రెస్ నెగ్గింది. ప్రజాస్వామ్యమే గెలిచింది. ఓటు చోరీ ఓడిపోయింది. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ఓటింగ్కు పాల్పడ్డారు. వారిలో నలుగురి ఓట్లు చెల్లలేదు. వాళ్ల పేరు నేను చెప్పదల్చుకోలేదు. వాళ్లెవరో ఇప్పటికే అందరికీ తెలిసే ఉంటుంది’’అని హరియాణా శాసనసభలో విపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్ సింగ్ హూడా అన్నారు.
షోకాజ్ నోటీస్లు జారీచేస్తాం..
మరోవైపు ఒడిశాలో స్వతంత్ర అభ్యరి్థ, బీజేపీ మద్దతున్న దిలీప్ రాయ్ను గెలిపించేందుకు ప్రయత్నించిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఒడిశా చీఫ్ భక్త చరణ్ దాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సనఖేముండి ఎమ్మెల్యే రమేశ్ చంద్ర జెనా, మోహన నియోజకవర్గ ఎమ్మెల్యే దాసరథి గోమంగో, బారాబటి–కటక్ ఎమ్మెల్యే సోఫియా ఫిర్దౌస్లను అనర్హులుగా ప్రకటించాలంటూ ఒడిశా అసెంబ్లీ మహిళా స్పీకర్ సురమా పథేకు కాంగ్రెస్ పక్షనేత రామచంద్ర కదమ్ మంగళవారం లేఖ రాశారు. క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై బీజేపీ వ్యంగ్యంగా స్పందించింది.
‘‘తమ సభ్యులకు స్పష్టంగా విప్జారీచేయడం కూడా కాంగ్రెస్కు తెలీదు. ప్రామాణిక పద్ధతిలో మూడు లైన్లలో విప్ను జారీచేయాలి. కానీ రాహుల్గాంధీ కాంబోడియాలో, తేజస్వీ యాదవ్ యూరప్లో విహారయాత్రలో బిజీగా ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర నేతలేమో అంతకన్నా బిజీగాఉన్నారు. ఇక ఎమ్మెల్యేలకు కఠిన విప్ జారీచేసేదెవరు?. అంతా అయిపోయాక వాళ్లకెందుక ఓటేశారు? అని షోకాజ్ నోటీస్లు జారీచేయడంలో ప్రయోజనం ఏముంటుంది?’’అని బిహార్లో పశి్చమచంపారన్ బీజేపీ ఎంపీ సంజయ్ జైశ్వాల్ వ్యాఖ్యానించారు.


